కొత్త బడ్జెట్లో రైల్వే శాఖకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. రూ.2,52,000 కోట్లు కేటాయించడాన్ని బట్టి ప్రభుత్వం ఈ శాఖకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదీ, ఈ శాఖ నుంచి ఎంతగా ఆశిస్తున్నదీ అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు సమానంగా రైళ్లను అభివృద్ధి చేయడంతో పాటు, నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఈ శాఖ మీద దృష్టి పెడుతోంద నేది అర్థమైపోతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వంలో రైల్వే, సమాచార, ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న 54 ఏళ్ల అశ్వినీ వైష్ణవ్ కూడా కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు తగ్గట్టుగానే దేశంలోని లక్షలాది మంది యువతీ యువకుల భవిష్యత్తులను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.
ఆ తర్వాత ఆయన వాజపేయి ప్రభుత్వంలో ప్రధాని కార్యాలయంలో పనిచేశారు. ప్రస్తుతం మోదీ వికసిత్ భారత్ పేరుతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఉద్దేశంలో ఉన్నందువల్ల ఆయన దృష్టి వైష్ణవ్ మీద పడింది. ఐ.టి, రైల్వే శాఖల ద్వారా వికసిత్ భారత్ మరింతగా నెరవేరే అవకాశం ఉంటుందని గుర్తించిన మోదీ ఈ రెండు శాఖలను ఒకే వ్యక్తికి అప్పగించారు. ఇదివరకటి మోదీ మంత్రి వర్గంలో కూడా రైల్వే మంత్రిగా పనిచేసిన అశ్వినీ వైష్ణవ్ దేశంలో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం విశేషం. సుమారు 250 జిల్లాలను కవర్ చేస్తూ ఆయన ఇదివరకే 85 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఇవి దేశ ముఖచిత్రాన్ని చాలావరకు మార్చేశాయి. రైల్వేల ప్రగతి ఆయన ఆధ్వర్యంలో వేగం పుంజుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 100 రైల్వేస్టేషన్లను పునర్నిర్మించారు. దేశంలోని మొత్తం 7,400 రైల్వేస్టేషన్లలో 1,300 స్టేషన్లను పూర్తిగా ఆధునీకరించారు.
వైష్ణవ్పథకాల విషయంలో లోపాలేవీ కనిపించక పోవడంతో ప్రతిపక్షాలు సహజంగానే ప్రయాణికుల భద్రత గురించి విమర్శిస్తున్నారు. సంస్థాగతంగా రైల్వేలో ఎన్నో లోపాలున్నట్టు కూడా అది విమర్శి స్తోంది. రైల్వే భద్రతా విభాగంలో సుమారు 1.75 లక్షల ఖాళీలు భర్తీ కాకుండా పడి ఉన్నాయి. వైష్ణవ్ ఇప్పుడు వీటిని భర్తీ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
రైల్వేలకు కొత్త భవిష్యత్తు
టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించి రైల్వేలను అత్యంత ఆధునికం చేయాలని కంకణం కట్టుకున్న మోదీ ఈ మేరకు వైష్ణవ్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మోదీ కలలుగంటున్న ఆధునిక పాలనలో వైష్ణవ్ ఒక ప్రధాన ఆలంబన. ఒడిశాలో 1996లో సంభవించిన తుపాను నష్టాన్ని తగ్గించడంలో, ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించిన వైష్ణవ్ను వాజపేయి ప్రధానమంత్రి కార్యాలయంలో చేర్చిన వ్యక్తి ప్రధాని సంయుక్త కార్యదర్శి అశోక్ సైకియా. ఆ తర్వాత ఆయన వాజపేయి వ్యక్తిగత కార్యదర్శిగా మారారు.
ఆ తర్వాత ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని, జి.ఇ కార్పొరేషన్లో సి.ఇ.ఓగా చేరారు. ఐ.ఐ.టి, ఆ తర్వాత ఎం.బి.ఏ చేసిన వైష్ణవ్ సీమెన్స్లో కూడా పనిచేశారు. ఆయన స్వయంగా ఇనుము, ఉక్కు, ఊచలకు సంబంధించిన సంస్థలను కూడా నెలకొల్పారు. కేవలం భాగస్వామ్య ఒప్పందాల కోసం ఆ తర్వాత ఆయన తన వ్యాపారాలను గుజరాత్కు మార్చారు. ఆపై ఆరు నెలలకే ఆయనకు మోదీ నుంచి ఆహ్వానం అందింది. ఇక ఐ.టి మంత్రిగా ఆయన కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని. వివిధ ఐ.టి సంస్థలను ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో పాటు కొత్త ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించదలచుకున్నారు. విద్యావంతులైన యువతీ యువకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఐ.టి సంస్థల విస్తరణకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.
కేంద్రంలో సరికొత్త ప్రణాళిక చోటు చేసు కుంటోంది. కీలకమైన దేశ అవసరాలు, సమస్యలు, ఎన్.డి.ఎ ఎన్నికల మేనిఫెస్టోలోని విషయాలు వగైరాల కారణంగా బడ్జెట్ తర్వాత నుంచి కేంద్రంలో ఆరుగురు మంత్రులకు చేతి నిండా పని ఉండే అవకాశం కనిపిస్తోంది. మోదీ నాయ కత్వంలోని మూడవ పర్యాయపు ఎన్డీఏ ప్రభుత్వంలో వాగ్దా నాలు, అనుసరించి, వ్యవసాయం, నీరు, పరిశ్రమలు, కార్మికులు, ఉద్యోగాలు వంటి రంగాలు ప్రధానంగా ఊపందు కోవాలి. నిజానికి, మోదీ ప్రభుత్వం ఈ రంగాలను దృష్టిలో ఉంచుకునే సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. కేంద్రంలోని నలుగురు మంత్రులు – శివరాజ్సింగ్ చౌహాన్, చిరాగ్ పాశ్వాన్, సి.ఆర్, పాటిల్, మన్ సుఖ్ మాండవీయాలను ఇప్పటికే సమాయత్తం చేయడం జరిగింది.
వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలు సంపూర్ణంగా తెలుసు. ఆయన ఇప్పటికే తనకు అవసరమైన సమాచారాన్ని సమీకరించుకున్నారు. దేశంలో దాదాపు 45 శాతం మంది వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉన్నారు. జాతీయాదాయంలో ఆరు శాతం ఈ రంగం నుంచే సమకూరుతోంది. జాతీయాదాయాన్ని పెంచా లన్నా, పేదరికాన్ని నిర్మూలించాలన్నా ఈ రంగం అభివృద్ధి కీలకం. పారిశ్రామిక రంగంలో మాదిరిగా కాకుండా వ్యవసాయ రంగంలో ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి.
రైతు సంక్షేమంపై దృష్టి
గతంలో లోక్సభ ఆమోదించి, ఆ తర్వాత రైతుల నిరసనల కారణంగా ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాలను రైతుల ఆకాంక్షలకు తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులతో తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రైతులకు మరింత వెసులుబాటుగా, సౌకర్య వంతంగా రుణ సౌకర్యాలు కల్పించడం, మార్కెటింగ్ సౌకర్యాలను పెంచడం, ఆహార ధాన్యాల నిల్వకు వసతులు మెరుగు పరచడం, వ్యవసాయ సంఘాలను మరింత పటిష్ఠం చేయడం వంటి విషయాల్లో మరిన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. వ్యవ సాయాభివృద్ధిని, గ్రామీణాభివృద్ధిని మేళవించి కొత్త కార్యక్రమాలను చేపట్టాలన్నది కేంద్ర ప్రభుత్వం ధ్యేయంగా కనిపిస్తోంది. అయితే, ఇందులో సగానికి సగం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించా ల్సిన ఉన్నందువల్ల నాలుగు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చౌహాన్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం సాధించాలి.
ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చిరాగ్ పాశ్వాన్ కొంత మేరకు చౌహాన్తో సమన్వయం సాధిస్తూనే, దేశంలో ఆహారధాన్యాల సరఫరా, పంపిణీ వంటి కీలక విషయాల్లో సత్తా ఏమిటన్నది నిరూపించుకోవాలి. ఆహారధాన్యాలు, నిత్యావసర సరుకుల ధరలు పెరగడం ఆర్థిక,రాజకీయ రంగాల మీద ప్రభావం చూపిస్తుంది. ఆహార ధాన్యాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే దాదాపు 8 శాతం వరకు ద్రవ్యోల్బణం కనిపిస్తోంది. సరిగ్గా ధాన్యం ఉత్పత్తి జరగకపోవడంతో పాటు, సరైన నిల్వ వ్యవస్థలు లేకపోవడం, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల రైతాంగం దీనావస్థలోనే ఉంటూ వస్తోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అగ్ర స్థానంలో ఉన్నప్పటికీ, ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో బాగా వెనుకబడిఉంది. పంటనష్టాలు జరగకుండా ఉండాలన్నా, పంట వృథా కాకుండా ఉండాలన్నా ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి.
భారీగా ఉద్యోగాల సృష్టి
రైతులు తమ ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవడానికి, అవసరమైనప్పుడు లేదా వీలైనప్పుడు అమ్ముకోవడానికి తగ్గట్టుగా నిల్వ కేంద్రాలను దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలి. రైతుల కోసం ఇటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక జిల్లా, ఒకే ధాన్యం అనే విధానాన్ని అవలంబించడం మీద కూడా దృష్టిసారించాలి. ఆహారధాన్యాలను సరైన రీతిలో మార్కెటింగ్ చేయడంతో పాటు వీ• వల్ల వస్తున్న ఆదాయాన్ని పెంచడం, వీటి ద్వారా మరిన్ని ఉద్యోగాలను సృష్టించడం కూడా ఇప్పుడు కీలకాంశంగా మారింది.
దేశంలో నీటి సమస్యలు, జల సంక్షోభాలు క్రమంగా పేట్రేగిపోతున్న నేపథ్యంలో జల శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ఈ రంగం మీద మరింతగా దృష్టి పెట్టాలి. భారతదేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ఇది ఎవరికీ పట్టని సంక్షోభంగా మారిపోయింది. ఇప్పుడు ఈ సమస్యను, సంక్షోభాన్ని తప్పనిసరిగా పట్టించు కోవాలి. నీటి నిల్వ, నీటి లభ్యత, నీటి నాణ్యత, నీటి సరఫరాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడానికి ఉద్దేశించిన హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టవలసి ఉంటుంది. దేశంలోని దాదాపు వంద లోక్సభ నియోజకవర్గాల్లో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయిలో ఉంటున్నాయి. ఈ నియోజక వర్గాలకు పూర్తిగా ట్యాంకర్ల ద్వారానే నీరు అందుతోందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, దాదాపు ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచి నీరు తీసుకు వచ్చి సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.
కీలక సమస్యలకు పెద్ద పీట
దేశంలో అత్యవసరంగా ఉప్పు నీటి నుంచి మంచి నీటిని తీసే వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. అంతేకాక, నీటిని రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు భారీగా నిధులు సమకూర్చడమే కాకుండా, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కోసం ప్రయత్నిం చాలి. ఇందుకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు ప్రకటించాలి. రాజకీయ నాయకుడు గానే కాకుండా, ఒక సాంకేతిక పరిజ్ఞాన నిపుణుడుగా కూడా ఎంతో అనుభవం ఉన్న పాటిల్ ఈ రంగాన్ని ప్రక్షాళన చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఇప్పటి నుంచే నడుం బిగించారు. ప్రభుత్వం కూడా నిధులపరంగా, సిబ్బందిపరంగా ఇప్పటికే అవసర మైన సౌకర్యాలన్నీ కల్పించినందువల్ల ఆయన రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారు. కార్మిక వ్యవహారాలు, యువజన వ్యవహారాలు, ఉపాధి వంటి కీలక రంగాలకు చెందిన మంత్రి మన్సుఖ్ మాండవీయా, నైపుణ్యాల అభివృద్ధి శాఖకు మంత్రిగా ఉన్న జయంత్ చౌధురి ఇదివరకెన్నడూ లేనంత స్థాయిలో ఈ రంగాల మీద దృష్టి పెట్టడం జరుగు తోంది. దేశంలో అత్యంత కీలక, క్లిష్ట సమస్యగా ఉన్న ఉపాధి కల్పన రంగానికి కొత్త దశ, దిశ కల్పిం చేందుకు ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నారు. నిరు ద్యోగం, ఉపాధి కల్పన వంటి సమస్యల ప్రభావం గత ఎన్నికల్లో బాగానే కనిపించింది. కేంద్ర ప్రభుత్వం ఈసారి ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కార్మికులను సృష్టించే విధానాన్ని ఇక పకడ్బందీగా అమలు చేసే పనిలో పడింది. విద్యావంతులకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి వారిని దేశంలోని కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు లభించే అవకాశా లను పెంచడం మీద ఈ మంత్రులు ఇప్పటికే దృష్టి పెట్టారు. ఉద్యోగాలు దొరకని లక్షలాధి మంది విద్యా వంతులకు సంబం ధించిన వివరాలను సేకరించి, వారికి ఉద్యోగాలు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని వీరు మున్ముందు మరింత భారీ స్థాయిలో చేపట్టే అవకాశం ఉంది.
పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పీయూష్ గోయల్ దేశంలో అనేక కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు, అతి ప్రధానమైన వాణిజ్య సంస్థలను విస్తరించడం మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. విదేశాల నుంచి పెట్టుబడులను ఆకట్టుకోవడంతో పాటు, విదేశీ కంపెనీలు భారతదేశంలో తమ సంస్థలను ఏర్పాటు చేసేలా ఆయన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్, ఫార్మస్యూటికల్, వైద్య పరికరాలు వంటి రంగాల్లో అతి వేగంగా అగ్రస్థానానికి చేరుకుంటున్న భారతదేశం ఈ రంగాలను దేశవ్యాప్తంగా విస్తరించ డానికి, తద్వారా ఉపాధి సమస్యను పరిష్కరించడానికి పీయూష్ గోయల్ ప్రయత్నిస్తున్నారు. చైనాను కాదని అనేక దేశాలు భారతదేశంలో తమ మార్కెట్ కార్య కలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి పీయూష్ గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పారిశ్రామిక కేంద్రాలను విస్తరించే కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో అమలు కాబోతోంది. వీటివల్ల విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడంతో పాటు ఉపాధి కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతాయి. మొత్తం మీద రాజకీయ అనివార్యాలు, ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఈ మంత్రుల మీద ఉన్నట్టు అర్థమవుతోంది.
జి.రాజశుక
సీనియర్ జర్నలిస్ట్