మతోన్మాదంతో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారు ఎవరో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదానికి పాల్పడుతున్నదెవరో తెలిసినా, బాహాటంగా చెప్పే ధైర్యం సెక్యులరిస్టులకీ, ఉదారవాదులకీ లేదు. దానిని కప్పిపుచ్చి హిందువులకు ఆ మరక అంటించడానికి చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాషాయ ఉగ్రవాదమన్నాడో మూర్ఖ కాంగ్రెస్ హోం మంత్రి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అన్యమతస్తులను హిందూ పేర్లతో ప్రచారం చేసి హిందువులు ఉగ్రవాదులని, అసాంఘిక శక్తులని చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పనికిమాలిన మీడియా అందుకు సహకరిస్తోంది. దేశాన్ని కుదిపేసిన 26/11 ముంబై ఉగ్రదాడులు, తాజాగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడిలో నిందితులను హిందువుగా చూపేందుకు సామాజిక మాధ్యమాలు ప్రయత్నం చేశాయి. కానీ వారు విదేశీయులనీ, అందునా ముస్లింలని వెల్లడయింది.
సైఫ్పై దాడి ఎవరిది?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్పై ఆగస్ట్ 16న అర్ధరాత్రి అగంతకుడు కత్తితో దాడి చేశాడు. నగరంలోని లీలావతి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందించడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. 12వ అంతస్తులో సీసీ కెమెరాల నిఘాలో భారీ భద్రత మధ్య ఉండే సినీనటుడిపై జరిగిన దాడిని రాజకీయంగా వాడుకునేందుకు మహారాష్ట్రలోని విపక్షాలు ప్రయత్నించాయి. నటుడిపై దాడి ఒక సంచలనం కావడమే ఇందుకు కారణం. నిందితుడిని ముంబై పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. నిందితుడు విజయ్దాస్ అంటూ మొదట ఒకమాట వచ్చింది. పోలీసుల విచారణలో విజయ్దాస్ పెట్టుడు పేరని, అసలు పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ అని వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు చెబుతున్నా, బాంగ్లాదేశీయుడని జోన్-1 డిప్యూటీ పోలీస్ కమిషనర్ దీక్షిత్ గెడమ్ చెప్పారు. షెహజాద్ 4 నెలల క్రితమే ముంబై వచ్చాడని, నగరం పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తూ చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నాడని చెప్పారు. అతను ఓ రెస్టారెంట్లో వెయిటర్గా పని చేస్తున్నాడన్నారు. నిందితుడు తొలుత తాను కోల్కతా వాసినని చెప్పి దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. అతని మొబైల్ ఫోన్లో బాంగ్లాదేశ్కు చెందిన అతని సోదరుడి నుండి అతని స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ను గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు.
ఆర్ఎస్ఎస్పై దుష్ప్రచారం
బాలీవుడ్ నటుడిపై దాడిని హిందువులపై రుద్దేందుకు సోషల్ మీడియాలో ప్రయత్నించారు. దుండగుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్తో సంబంధం కలిగి ఉన్నాడన్న ప్రచారం సాగింది. ‘ముస్లిం బాలీవుడ్ నటుడు, సైఫ్అలీఖాన్ను ఆర్ఎస్ఎస్ సభ్యుడు 6 సార్లు కత్తితో పొడిచాడు. అతను ఆసుపత్రిలో చేరాడు. భారతదేశంలో ముస్లింల పరిస్థితి!’ అంటూ ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఈ పోస్ట్ను సైఫ్ అలీఖాన్ ఫోటోతో పాటు కొందరు వ్యక్తులు కుంకుమ పువ్వు ధరించి, కత్తులు పట్టుకుని ఉన్న చిత్రంతో షేర్ చేశారు. ఫ్యాక్ట్ చెక్లో ఇది అవాస్తవమని వెల్లడైంది.
ముంబై దాడుల్లో పాకిస్తానీ
హిందువులను ఉగ్రవాదులుగా చిత్రించే ప్రయత్నం ఇప్పటిది కాదు. 2008 నాటి ముంబై దాడులను హిందూ ఉగ్రదాడిగా చిత్రీకరించేందుకు లష్కరే తొయిబా కుట్ర పన్నిందని ముంబై మాజీ పోలీసు కమిషనర్ రాకేశ్ మరియా వెల్లడించారు. 26/11 ఉగ్రదాడిని హిందూ ఉగ్రవాద చర్యగా అభివర్ణించేందుకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కుట్రను తన ‘లెట్ మీ సే ఇట్ నౌ’ అనే పుస్తకంలో పొందుపర్చారు. ఇందుకు లష్కరే తొయిబా సాయం కూడా ఉంది. పాకిస్తాన్కు చెందిన మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్కు బెంగళూరులోని ఓ కళాశాల విద్యార్థి అంటూ ఓ గుర్తింపు కార్డు సృష్టించారు. బెంగళూరుకు చెందిన దినేష్ చౌదరి కుమారుడు సమీర్ చౌదరిగా గుర్తింపు కార్డుల్లో పేర్కొన్నారు. ముంబై పేలుళ్ల తర్వాత భుజాన బ్యాగ్తో తుపాకీ పట్టుకున్న కసబ్ చేతికి ఎర్రదారం కనిపించేలా ఉన్న ఒక ఫొటో వెలుగులోకి తెచ్చారు. లష్కరే తోయిబా పథకం సఫలమై ఉంటే, కసబ్ను హిందువుగా పేర్కొంటూ మీడియా బురద జల్లేదని ఆ పోలీస్ అధికారి పేర్కొన్నారు. కసబ్, తోటి రిక్రూట్ ఇస్మాయిల్ఖాన్తో కలిసి ముంబై దాడుల్లో 72 మందిని హతమార్చాడు. కసబ్ సజీవంగా దొరకడంతో అసలు విషయాలు వెలుగు చూసినట్టుగా ఆయన చెప్పారు.
కసబ్ ఉదంతంలో ఓ వాస్తవం వెల్లడైంది. భారతదేశంలో ముస్లింలకు నమాజ్ చేయడానికి అనుమతి లేదన్న ప్రచారాన్ని కసబ్ నమ్మాడు. భారత్లో మసీదులకు అధికారులు తాళాలు వేశారని భావనలో ఉన్నాడు. అదే విషయాన్ని నాటి ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మరియాతో చెప్పాడు. దీంతో కసబ్ను సమీపంలోని మసీదుకు తీసుకెళ్లమని విచారణ అధికారి రమేష్ మహాలేకు చెప్పారు. ఆ మసీదులో కసబ్ నమాజ్ కూడా చేశాడు.
కాంగ్రెస్ దుష్ప్రచారం
తొలినుంచి హిందూ వ్యతిరేక విధానంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్నీ అందుకు వాడుకోవాలని ప్రయత్నించింది. ఆగస్టు 25, 2010 న నిర్వహించిన డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సులో నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం మాట్లాడుతూ ‘కాషాయ ఉగ్రవాదం’ పదాన్ని వాడారు. గతంలో జరిగిన అనేక బాంబు పేలుళ్లలో ‘కాషాయ ఉగ్రవాదం’ ప్రమేయం ఉందన్నారు. దీనిపై పార్లమెంట్లో శివసేన నాయకుడు మనోహర్ జోషి నిలదీశారు. చిదంబరం తర్వాత కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సుశీల్ కుమార్ షిండే ‘కాషాయ ఉగ్రవాదం’ అంటూ కూశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ‘కాషాయ ఉగ్రవాదాన్ని’ వ్యాప్తి చేయ డానికి ‘ఉగ్రవాద శిక్షణ’ శిబిరాలను నిర్వహిస్తున్నాయని ఆరోపించాడు. దీనిపై దేశవ్యాప్తంగా హిందువుల నుంచి ఆగ్రహం వ్యక్తమవడంతో చివరికి క్షమాపణ చెప్పాడు. హిందువుల ఆగ్రహాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. చిదంబరం, షిండేల వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేవని చెప్పుకు నేందుకు తంటాలు పడింది.
కాషాయరంగు స్వాతంత్య్రోద్యమంతో ముడిపడి ఉందని, ఉగ్రవాదానికి రంగుతో సంబంధం లేదని నాటి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మీడియా సెల్ హెడ్ జనార్దన్ ద్వివేది వివరణ ఇచ్చుకున్నారు. నాటి కాంగ్రెస్ నేతల ‘కాషాయ ఉగ్రవాదం’పై నేటికీ ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు సందర్భం వచ్చిన ప్రతిసారీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. హిందూద్వేషం వెళ్లగక్కడంలో కమ్యూనిస్టులూ తక్కువేం కాదు. కేరళలోని అయ్యప్పస్వామి ఆలయంలో బలవంతంగా మహిళలను పంపే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ హిందువులు ఆందోళన చేశారు. అధిక సంఖ్యలో మహిళలు ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా నాటి కేరళ మంత్రి, సీపీఎం నాయకుడు థామస్ ఐజాక్ అయ్యప్ప భక్తులందరినీ ఉగ్ర వాదులుగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు.
మీడియాదీ అదే ధోరణి..
నటుడు సై•••పై దాడి చేసిన వాడు బాంగ్లా దేశీయుడని, అతని పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ అని పోలీసు అధికారులు స్పష్టంచేసిన తర్వాత కూడా, విజయ్దాస్గా వామపక్ష పత్రికల్లో వార్తల్లో కనిపిస్తోంది. బాంగ్లాదేశీయుడిగా గుర్తించామన్న మాటే ఆ వార్తల్లో లేకపోవడం వారి దృష్టి లోపానికి నిదర్శనం. సైఫ్పై దాడికి పాల్పడిన వ్యక్తి తరపున వాదించడానికి వచ్చిన న్యాయవాదుల వ్యవహారం పైనా నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు ఆసక్తి కరంగా ఉన్నాయి. అతడి తరపున వాదించ డానికి ఇద్దరు లాయర్లు పోటీపడడం విచిత్రం. తాను వాదిస్తానని ఒక లాయర్ చెబితే, వకల్తానామా తాను తీసుకుంటానంటూ మరో లాయర్ వచ్చాడు. నిరు పేదలకు ఉచిత న్యాయ సాయం అందించేందుకు ఓ పక్రియ ఉంది. కానీ, బాంద్రా మేజిస్ట్రేట్ ఇద్దరికీ అవకాశమిచ్చినట్లు హిందూస్థాన్ ట్కెమ్స్ పేర్కొంది. కాగా, దాడికి పాల్పడిన షాజాద్ బాంగ్లాదేశ్లో జాతీయ స్థాయి రెజ్లర్ పోటీల్లో పాల్గొన్నట్లు పోలీసుల మాట!