కాంగ్రెస్ పార్టీ అంచనాలు బూమరాంగ్ అయ్యాయి. తెలంగాణ కులగణన సర్వేను దేశానికే రోల్మోడల్గా చూపించుకుందామని ఉవ్విళ్లూరిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒకరకంగా ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ఆదర్శవంతం కాదు గానీ, ఈ సర్వే జరిగిన తెలంగాణలోనే దుమారం రేగుతోంది. ఇప్పుడీ సర్వే జరిగిన తీరును, సర్వే నివేదికను ప్రతిపక్షాలు మాత్రమే విమర్శిస్తున్నాయంటే రాజకీయ కారణాలనుకోవచ్చు. కానీ, తమ కోసమే ఈ సర్వే చేశారని మొదటినుంచీ చెప్పుకుంటోన్న బీసీ సంఘాలు కూడా అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. అసలు సర్వే మొత్తం తప్పుల తడక అని కొట్టిపారేస్తున్నాయి. అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
వాస్తవానికి కులగణన సర్వేను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ప్రభుత్వ సమీక్షలకు ఆ నేతలు కూడా హాజరయ్యారు. ఏకంగా పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ కూడా హాజరయ్యారు. అంతేకాదు..తెలంగాణలో జరుగుతున్న కులగణన సర్వేను చూపించి జాతీయస్థాయిలో ప్రస్తావించారు. ఓ దశలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. పేరుకు సామాజిక, కులగణన అయినా, ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన లెక్కలు తేలుస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ, ఇప్పుడు వీళ్ల లెక్కలు తారుమారయ్యాయి. ఇన్నాళ్లు దేశంలోనే తాము గొప్ప అంటూ ప్రచారం చేసుకున్న కులగణనపై ముప్పేట దాడి మొదలయ్యింది. దీంతో, జాతీయ స్థాయిలో దీనిని ఉదాహరణగా తీసుకొని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవచ్చన్న కాంగ్రెస్పార్టీ అంచనాలు బెడిసికొట్టాయి.
ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య సంబంధిత సమగ్ర సర్వే అని ప్రచారం చేసినా.. దీనికి బీసీ కులగణనగానే ప్రచారం వచ్చింది. అందరూ బీసీ కులగణన అనే ప్రస్తావించు కున్నారు. దీంతో, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సర్వే అయినప్పటికీ.. బీసీ కులగణన అంటూ సర్వత్రా చర్చ జరిగింది. అందరూ అదే అంశంతో ముందుకెళ్లారు. కానీ, అదే అంశం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టింది. గడిచిన పదేళ్లలో బీసీ జనాభా తగ్గిందన్న అంశం నివేదికలో పొందుపర్చడం రాజకీయ, సామాజిక వివాదానికి కేంద్రబిందువుగా మార్చింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సమగ్ర కులగణన వివరాలు, అందులోని బీసీ లెక్కలపై దుమారం నెలకొంది. సర్వే జరిగిన తీరుపైనా అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. 2014లో 1.85 కోట్లుగా ఉన్న బీసీ జనాభా గడిచిన పదేళ్లలో పెరగాల్సింది పోయి 21 లక్షలకుపైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 52 శాతంగా ఉన్న బీసీ జనాభాను 46 శాతానికి కావాలనే తగ్గించారని పలువురు బీసీ మేధావులు, ప్రొఫెసర్లు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టి, నివేదికపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సమగ్ర కులగణన సర్వే తీరుపైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3 కోట్ల 50 లక్షలు కాగా, గడిచిన 14 ఏళ్లలో జనాభా కేవలం 20 లక్షలే ఎలా పెరుగుతుందని నిలదీస్త్తున్నారు. గత నెలలో ప్రకటించిన ఓటర్ల తుది జాబితాకు, తాజాగా ప్రకటించిన జనాభా వివరాలకు పొంతన కుదరడం లేదని అంటున్నారు.
మంత్రివర్గ ఉప సంఘానికి అందిన సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రంలో 3 కోట్ల 70 లక్షల జనాభా ఉంది. ఇదే విషయాన్ని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ లెక్కలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3 కోట్ల 50 లక్షల జనాభా ఉంది. ఈ 14 సంవత్సరాలలో కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల దాకా జనాభా పెరిగి ఉంటుందని, ఆ ప్రకారం చూస్తే రాష్ట్ర జనాభా 4 కోట్ల నుంచి 4 .20 కోట్లకు చేరుతుందని అందరూ భావించారు. కానీ, ఈ 14 సంవత్సరాల్లో కేవలం 20 లక్షల జనాభా మాత్రమే పెరగడం అందరిలోనూ చర్చకు దారితీసింది. అంతేకాదు, జనవరి 6వ తేదీన ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 3 కోట్ల 35 లక్షల 27 వేల 925 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన ఓటు హక్కు లేని 18 ఏళ్ల లోపు వారు కేవలం 35 లక్షల మందే ఉండాలి. కానీ, అంగన్వాడీలు, స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఎన్ రోల్ అయిన విద్యార్థుల సంఖ్యే ఏకంగా 80 లక్షల దాకా ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతు న్నాయి. ఇంకా స్కూలుకు వెళ్లని చిన్నారులు, ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోని వాళ్లను కలిపితే కోటి దాకా ఉండొచ్చు. అంటే ఏరకంగా చూసినా రాష్ట్ర జనాభా 4 కోట్ల20 లక్షలకు పైమాటే అని చెప్పొచ్చు. కానీ, సమగ్ర సర్వేలో ఏకంగా 50 లక్షల దాకా జనాభా తగ్గడంపై విమర్శలు వ్యక్తమవు తున్నాయి.
వాస్తవానికి 2021లో జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ప్రభుత్వం దగ్గర పూర్తిస్థాయి జనాభా లెక్కలుగానీ, కులాలవారీ వివరాలుగానీ అందుబాటులో లేవు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ ఆ వివరాలు బయటపెట్టలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన నలుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ నియమించింది. తర్వాత హైకోర్టు జోక్యంతో నవంబర్ బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. నవంబర్ 6 నుంచి డిసెంబర్10వ తేదీ వరకు ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే-2024’ పేరుతో సమగ్ర కులగణన సర్వే నిర్వహించారు. గ్రామీణ ప్రజలు ఈ సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ పట్టణాల్లో, ముఖ్యంగా జీహెచ్ఎంసీలో జనం సహక రించలేదని, చాలా మంది వివరాలు ఇవ్వలేదని, ఎన్యూమరేటర్లపైకి కుక్కలను ఉసిగొల్పారని పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు చెప్పారు.
సర్వేలో పాల్గొనని పలువురు ప్రముఖులపై సీఎం రేవంత్ రెడ్డి సైతం అసహనం వ్యక్తం చేశారు. అదీగాక జీవనోపాధి కోసం పల్లెల నుంచి నగరాలకు వచ్చి, అద్దె ఇళ్లలో ఉంటున్న వారిని సర్వే టీమ్లు కనీసం పలకరించలేదనే విమర్శలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే అసలు కులగణన సిబ్బంది తమ ఇళ్ల వైపు కన్నెత్తిచూడలేదని పలుచోట్ల ప్రజలు ఆరోపించారు. పోనీ ఇలాంటి వారు తమ గ్రామాలకైనా వెళ్లి కుటుంబ వివరాలు ఇచ్చారా? అంటే అదీ లేదు. ఇలా ఏరకంగా చూసినా సర్వే అసమగ్రంగా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2014లో జరిగిన సమగ్ర సర్వేలో బీసీల జనాభా 52 శాతంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 46 శాతానికి తగ్గించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఏకంగా 6 శాతానికి పైగా జనాభాను తగ్గించి చూపారని మండిపడ్డారు. హైదరాబాద్లో ఇంటింటి సర్వే నిర్వహించలేదని, ప్రభుత్వం మరోసారి కులగణన నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల జనాభాను పథకం ప్రకారం 21 లక్షలకు తగ్గించారని, సర్కారుకు దమ్ముంటే జనాభా లెక్కలను కులాలవారీగా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు.
ఇటు ప్రతిపక్ష నేతలు కూడా బీసీ లెక్కలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేవలం ఓసీ జనాభాను మాత్రమే పెంచి చూపి మిగతావన్నీ తగ్గించారని, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూసినా, 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా ప్రస్తుత జనాభా లెక్కలు సరిపోలడం లేదని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపడంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. కాగా, కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, హరీశ్రావుకు, జస్టిస్ ఈశ్వరయ్య, వకుళాభరణం కృష్ణమోహన్ లాంటి బీసీ నాయకులకు తమను విమర్శించే హక్కులేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కావాలనే కొంత మంది సర్వేలో పాల్గొనలేదని, అలాంటి వారు ఇప్పటికైనా తమ వివరాలు అధికారులను సమర్పిం చాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే బీసీ లెక్కలపై వాడీవేడి చర్చ జరుగుతోంది. తాజా సర్వే ప్రకారం ముస్లిమేతర బీసీల జనాభా కోటి 64 లక్షలు అంటే 46.25 శాతం ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల పేరుతో ఓ నివేదికను బయటపెట్టారు.
పాత, కొత్త నివేదికలను పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. వీటి ప్రకారం అప్పట్లో బీసీల జనాభా కోటి 85 లక్షల 61 వేల 856గా ఉంది. ఈ లెక్కన గడిచిన పదేళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 21 లక్షలకుపైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
– సుజాత గోపగోని, సీనియర్ జర్నలిస్ట్, 6302164068