అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు మహంత సత్యేంద్రదాస్ ఫిబ్రవరి 12న పరమపదించారు. 85 సంవత్సరాల దాస్ (1940-2025) మెదడులో నాళాలు చిట్లి కొద్దిరోజులుగా అస్వస్థులుగా ఉన్నారు. 13వ తేదీన ఆయన పార్ధివ దేహాన్ని సరయు నదిలో జల సమాధి చేశారు. 1992 నుంచి కడ ఊపిరి వరకు ఆయన రామ జన్మభూమిలో ప్రధాన అర్చకులుగా సేవలు అందించారు. దాస్ ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్నగర్లో జన్మించారు. ఇది అయోధ్యకు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సత్యేంద్రదాస్ విద్యాభ్యాసం అయోధ్యలోనే జరిగింది. 1975లో ఆయన సంస్కృత విద్యాపీఠ్ నుంచి ఆచార్య పట్టా పొందారు. అక్కడే సంస్కృత మహా విద్యాలయంలో సహాయక అధ్యాపకుని పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరి కుటుంబం చిరకాలంగా అయోధ్యతో అనుబంధం కలిగి ఉంది. అలాగే అక్కడి అభిరామ్దాస్ ఆశ్రమంతో కూడా ఆ అనుబంధం ఉంది. అభిరామ్దాస్ అంటే 1949లో రామజన్మభూమిలో విగ్రహాలను మార్చారని చెప్పే ఉదంతంలో కీలకంగా వ్యవహరించారని అంటారు. తరువాత వ్యాజ్యంలో కూడా అభిరామ్దాస్ కీలకపాత్ర పోషించారు. 1992లో కట్టడం కూల్చిన తరువాత రాములవారి విగ్రహాలను సురక్షిత ప్రాంతానికి తరలించే కార్యక్రమంలో సత్యేంద్రదాస్ పాలు పంచుకున్నారు. సత్యేంద్రదాస్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.