భారతదేశంలో ఉగ్రవాదం, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి విదేశాల్లో ఆశ్రయం లభిస్తోంది. ఆ నేరగాళ్లను భారత్కు రప్పించేందుకు విదేశాల్లో భారత్ న్యాయ పోరాటం చేస్తోంది. ముంబై ఉగ్రవాది దాడి కేసులో ప్రధాన నిందితుడు తహవూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించింది. మన దేశంలో సుమారు రూ.9 వేల కోట్ల వరకు బ్యాంకు రుణాలను ఎగవేసిన విజయ్ మాల్యా, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.14 వేల కోట్ల రుణం ఎగ్గొట్టిన నీరవ్ మోదీ ప్రస్తుతం యూకేలో ఉన్నారు. వారిని భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సుముఖంగా ఉన్నా, న్యాయస్థానాల్లో సాగుతున్న విచారణ ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నిందితులను తీసుకువచ్చేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్కు అప్పగించాలని కోరారు. ఇదే సమయంలో వేలమంది ప్రాణాలు తీసుకుని, భావితరాలను వ్యాధులకు గురి చేసిన ఘటనలో ప్రధాన కారకుడిని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాచమర్యాదలతో అమెరికా పంపింది.
26/11 .. ముంబైలో ఉగ్రవాదుల దాడిలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది మృతి చెందారు. ఈ ఘటన జరిపింది హిందువులని చెప్పే కుట్ర కూడా జరిగింది. 2008లో జరిగిన ఈ దాడుల్లో లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్క్రెడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబ్కె చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో కీలక సూత్రధారిగా పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తహవూర్ రాణాను గుర్తించారు. దాడి జరిగిన ఏడాది తర్వాత షికాగోలో ఎఫ్బీఐ అధికారులు రాణాను అరెస్టు చేశారు. ముంబై దాడులకు పాల్పడిన రాణాను భారత్కు తీసుకు వచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్ని స్తోంది. రాణాను అప్పగించాలన్న భారత ప్రభుత్వ విజ్ఞప్తికి అమెరికా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అమెరికా కోర్టులను అడ్డుపెట్టుకుని రాణా భారత్కు రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గత ఏడాది అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాణా లాస్ఏంజిలస్ జైల్లో ఉన్న తహవూర్ రాణా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను జనవరి 21న అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, భారత్కు తీసుకువచ్చేందుకు మోదీ సర్కార్ చేసిన ప్రయత్నం సఫలం కానుంది.
రూ.9 వేల కొట్లు ఎగ్గొట్టిన మాల్యా
విజయ్మాల్యా.. ఓ వ్యాపారవేత్త. రాజకీయ నాయకుడు. 2003లో సుబ్రమణ్యస్వామి నేతృత్వంలోని జనతా పార్టీలో చేరారు. 2010 వరకు దాని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. జనతాదళ్ (సెక్యులర్) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతుతో 2002లో, 2010లో జనతాదళ్ (సెక్యులర్), బీజేపీ మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రూ.9,000 కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేసి విదేశాలకు పారిపోయారు. సీబీఐ ముంబైలోని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. 2016లో దేశం విడిచి బ్రిటన్కు పారిపోయిన మాల్యాను తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మాల్యా పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా కోర్టు ప్రకటించింది. బ్యాంకులు, ఇతర రుణదాతలను లిక్విడేట్ చేయడానికి, చెల్లించడానికి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్ఎల్ఎ) కింద అతని ఆస్తులను ఈడీ జప్తు చేసింది. యూకేలో ఉంటున్న మాల్యాను భారత్కు రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
వజ్రాల వ్యాపారి నీరవ్మోదీ
గుజరాత్కు చెందిన ప్రసిద్ద వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ. భారతదేశంలో అతి చిన్న వయసులోనే ఫోర్బస్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.280 కోట్లు మోసం చేశాడని తొలుత కేసు నమోదైంది. తర్వాత 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నీరవ్ మోదీ సుమారు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన వ్యవహారం బయట పడడంతో లండన్కు పారిపోయాడు. ఈ వ్యవహారంలో పలువురు అధికారులను బ్యాంక్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. నీరవ్ మోదీ తమ దేశంలోనే ఉన్నట్లు 2018లో బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. నీరవ్ మోదీని అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. 2019లో అక్కడి పోలీసులే అరెస్టు చేశారు. అతడిని భారత్కు అప్పజెప్పేందుకు బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినా న్యాయ స్థానాలను అడ్డుపెట్టుకుని నీరవ్మోదీ రాకుండా ఉండేందుకు ఎత్తుగడలు పన్నుతున్నాడు.
యూకేలోనే ఆయుధ వ్యాపారి
ఆయుధాల ఒప్పందంలో ముడుపులు అందుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ఇండియా నుంచి పారిపోయి యూకేలో తలదాచుకున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం రూ. 2,895 కోట్ల విలువ చేసే 75 పిలాటస్ బేసిక్ ట్త్రెనర్ ఎయిర్క్రాఫ్ట్ల కొనుగోలు ఒప్పందంలో అవినీతికి సంబంధించి సంజయ్ భండారీపై 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు సంజయ్ భండారీ, బిమల్ సరీన్లతో స్విట్జర్లాండ్కు చెందిన పిలాటస్ ఎయిర్క్రాఫ్ట్ లిమిటెడ్ సంస్థ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, 2010 జూన్లో భండారీతో మోసపూరితంగా సర్వీస్ ప్రొవైడర్ ఒప్పందం కుదుర్చుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఇది డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్, 2008 కింద ఉల్లంఘన జరిగినట్లు సీబీఐ ఆరోపించింది. సంజయ్ భండారీపై నల్లధనం సహా పలు సెక్షన్ల కింద ఆదాయం పన్ను అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు 2020 జూన్ 1న ఈడీ ఛార్జిషీట్ నమోదు చేసింది. ఆయనను యూకే నుంచి రప్పించేందుకు భారత్ ప్రభుత్వం అక్కడి న్యాయస్థానాల ద్వారా కృషి చేస్తోంది. భండారి ఓ విపక్ష కీలక నాయకుడి బంధువుకు బినామీ అనే ఆరోపణలు ఉన్నాయి.
డబ్బు వసూలుకు చర్యలు
ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి దేశం వీడి వెళ్లిపోయినా, వారి నుంచి డబ్బు వసూలు చేసేందుకు మోదీ ప్రభుత్వం ఈడీని ప్రయోగించింది. పరారీలో ఉన్న విజయ్మాల్యా, నీరవ్మోదీల ఆస్తులను జప్తు చేసింది. దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోదీ బ్యాంకులను రూ.6,498.20 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు, భారతదేశంలోని నీరవ్ మోదీ, అతని కంపెనీలకు చెందిన రూ.29.75 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గుర్తించింది. వీటిలో భూమి, భవనాలు, బ్యాంకు ఖాతా డిపాజిట్లు కూడా ఉన్నట్లు తేలింది. ఈ కేసులో నీరవ్ మోదీపై మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద కూడా కేసు నమోదైంది. గతంలో విచారణ సందర్భంలో నిందితుడితో పాటు అతని సహచరులకు చెందిన రూ.2,596 కోట్ల విలువైన స్థిరచరాస్తులు జప్తు చేశారు. రూ.1,052.42 కోట్ల విలువైన ఆస్తులు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇతర బ్యాంకులకు తిరిగి వచ్చాయి. పరారీలో ఉన్న విజయ్ మాల్యా నుంచి ఇప్పటివరకు రూ.14,131 కోట్లు రికవరీ అయ్యాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. యూకేలో వివిధ న్యాయస్థానాల్లోకూడా నీరవ్మోదీని భారత్కు అప్పగించాలని తీర్పు వచ్చింది.
అండర్స్కు రాజమర్యాదలతో..
ప్రపంచంలోనే అత్యంత దారుణ విషాదం భోపాల్ గ్యాస్ దుర్ఘటన. 1984 డిసెంబర్ 2వ తేదీ రాత్రి భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీకవడంతో వేలాది మంది మృత్యువాతపడ్డారు. ఆ ఘటన తాలూకు ప్రభావం ఇంకా ఆ ప్రాంత ప్రజలపై ఉంది. కొన్ని తరాల పాటు దానికి స్థానికులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది.
ఇంతటి దారుణానికి కారణమైన విదేశీ కంపెనీ చైర్మన్ను నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పంపించాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాటి పత్రికల కథనాల ప్రకారం.. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వచ్చిన కంపెనీ చైర్మన్ వారెన్ ఆండర్సన్ను కొన్ని గంటలు గృహనిర్బంధంలో ఉంచారు. తర్వాత దేశం విడిచి వెళ్లాడు. నాటి భోపాల్ కలెక్టర్ మోతీసింగ్, ఎస్పీ స్వరాజ్ పూరీ స్వయంగా అండర్సన్ను ప్రత్యేక విమానం ఎక్కించారన్న ఆరోపణలు ఉన్నాయి.
దుర్ఘటన సమయంలో భోపాల్ కలెక్టర్గా ఉన్న మోతీ సింగ్ రచించిన ‘భోపాల్ గ్యాస్ ట్రాజెడీ కా సచ్’లో ‘అర్జున్ సింగ్ ఆదేశాల మేరకు అండర్సన్ విడుదలయ్యాడ’ని పేర్కొన్నారు. నాటి ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అర్జున్ సింగ్ తన ఆత్మకథ ‘ఎ గ్రెయిన్ ఆఫ్ సాండ్ ఇన్ ది హవర్గ్లాస్ ఆఫ్ టైమ్’లో దీనికి సంబంధించి ప్రస్తావించారు. నాటి కేంద్ర హోంమంత్రి పీవీ నరసింహారావు సూచనల మేరకు, నాటి హోం కార్యదర్శి ఒత్తిడి మేరకు ఆ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. అండర్సన్ 2013లో అమెరికాలో మృతి చెందాడు. సుమారు 15 వేల మందిని బలిగొన్న ఘటనలో ఒక విదేశీ కంపెనీకి చెందిన అధినేతను కోర్టు గుమ్మం కూడా ఎక్కించలేకపోవడానికి నాటి పాలకులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. నాటి ప్రధాని రాజీవ్గాంధీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్.. ఇద్దరూ కాంగ్రెస్ నాయకులేనన్నది వాస్తవం!
చరిత్ర చెబుతున్న ఈ వాస్తవాల మధ్య.. గోబెల్స్ ప్రచారం సాగిస్తూ, విజయ్మాల్యా, నీరవ్ మోదీ పారిపోవడానికి ప్రధాని మోదీ కారణమని నేటికీ కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఆరోపిస్తారు. అండర్సన్ను రాచమర్యాదలతో పంపిన వైనం గురించి మాత్రం పెదవి విప్పరు. కానీ, ఈ ఘటనలను ఓసారి పరిశీలిస్తే.. దేశద్రోహులకు అండగా ఉన్నది ఎవరో అర్థమవుతుంది.
హేమచందర్ కొలిపాక
సీనియర్ జర్నలిస్ట్,