ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్, అమెరికాల్లో తన పర్యటనను విజయవంతంగా ముగించారు. ఈ రెండు దేశాల పర్యటన ఆ రెండు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థిరం చేసుకోవడంలో ఎంతో దోహదం చేసిందని చెప్పవచ్చు. మోదీ పర్యటన ఫ్రాన్స్లో ప్రారంభమైంది. ఫ్రాన్స్ మనకు ఎంతటి ఆప్త దేశమో ఈ పర్యటనతో మరోసారి నిరూపితమైంది. ఆ దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్ మక్రాన్ ఆహ్వానం మేరకు అక్కడకు చేరుకున్న ప్రధాని, కృత్రిమ మేధ (ఎ.ఐ.)పై జరిగిన సదస్సుకు కో-ఛైర్పర్సన్గా వ్యవహరించారు. ఆర్టిఫిషి•యల్ ఇంటెలిజెంట్ యాక్షన్ సమ్మిట్ పేరుతో ఫిబ్రవరి 11న ప్యారిస్లో జరిగిన సదస్సుకు వివిధ దేశాల అధినేతలు, సంస్థల అధిపతులు, ఎన్.జి.ఒ.లు, కళాకారులు, పౌరసమాజ సభ్యులు, చిన్న, పెద్ద సంస్థలకు చెందిన యజమానులు హాజరయ్యారు. 2023లో జరిగిన ఎ.ఐ. సదస్సులో సాధించిన మైలురాళ్లనదగ్గ అంశాలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ఇండో-ఫ్రాన్స్ నేతల ఉమ్మడి సదస్సులో, నరేంద్రమోదీ మాట్లాడుతూ, రక్షణ, పౌర అణు, బీమా ఆధునిక తయారీ రంగాల్లో ఫ్రాన్స్ కంపెనీలు నూతన అవకాశాలను అన్వేషించాలని కోరారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఇన్నోవేషన్, ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఆగ్రో ప్రాసెసింగ్ (వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి), వినియోగ వస్తువుల ఉత్పత్తులకు సంబంధించిన సి.ఇ.ఒ.లు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఇద్దరు నాయకులు ఫ్రాన్స్ అధ్యక్షుడి విమానంలో కలిసి మార్సెల్లీకి ప్రయాణించారు. ఇరుదేశాల మధ్య సాన్నిహిత్యం, నరేంద్రమోదీ- మక్రాన్ల మధ్యగల దృఢమైన స్నేహసంబంధాలకు ఇది ప్రతీకగా నిలిచిందనే చెప్పాలి. ఈ పర్యటనలో భారత్-ఫ్రాన్స్ల సంబంధాలు నూతన శిఖరాలకు చేరాయనవచ్చు. మార్సెల్లీకి చేరుకున్న తర్వాత ఇద్దరు నేతలు తమ ప్రతినిధి బృందాలతో కలిసి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు మక్రాన్, ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక విందును ఏర్పాటుచేశారు. యూరప్, పశ్చిమాసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో నెలకొన్న పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.
మార్సెల్లీ ఎంతో ముఖ్యం
ఫిబ్రవరి 12వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ పర్యటన మజార్గియస్ వార్ సెమిట్రీ సందర్శనతో ప్రారంభమైంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికులకు మోదీ, మక్రాన్ నివాళులు అర్పించారు. ‘మార్సెల్లీకి భారతీ యుల హృదయాల్లో కీలక స్థానం ఉంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వీర్సావర్కర్ను బ్రిటిష్ సైనికులు ఓడలో విచారణ నిమిత్తం యు.కె.కు తీసుకెళుతున్నప్పుడు ఆయన సరిగ్గా ఈ మార్సెల్లీ సమీపంలో సముద్రంలో దూకి, ఫ్రాన్స్లో తీరానికి చేరుకున్నారు. అయితే బ్రిటిష్ వారు నాటి ఫ్రాన్స్ అధికార్లకు లంచాలిచ్చి సావర్కర్ను తమతో తీసుకెళ్లడం చరిత్ర. సావర్కర్ను బ్రిటిష్వారికి అప్పగించవద్దని ఫ్రాన్స్కు చెందిన పౌర సమాజ కార్యకర్తలు డిమాండ్ చేశారు’ అని మోదీ తమ ప్రసంగంలో ప్రస్తావించారు. అనంతరం ఇద్దరు నేతలు మార్సెల్లీలో ఇండియన్ కాన్సులేట్ను ప్రారంభించారు.
కేడరచ్ఛేలోని ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పర్మెంటల్ రీడర్ ఫెసిలిటీని (ఐటీఈఆర్) సందర్శించారు. ఇక్కడ పరమాణు సంలీన శాస్త్రంపై జరిగే పరిశోధనల ఫలితంగా అత్యధిక పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. దీంతో పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. భవిష్యత్తులో ప్రపంచంలో నిర్మించబోయే అణురియాక్టర్లు ఈ సంలీన పక్రియకు సంబంధించినవే అయి ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా భారత్-ఫ్రాన్స్లు స్మాల్ మాడ్యులార్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్), అడ్వాన్స్ డ్ మాడ్యులార్ రియాక్టర్ల (ఎఎంఆర్) అభివృద్ధిలో, వీటిని కృత్రిమ మేధ సహాయంతో, సురక్షితంగా వినియో గించే విషయంలో పరస్పరం సహకరించుకుంటాయి. రానున్న కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అధికంగా విద్యుత్ అవసరమవుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ డైరెక్టర్ జనరల్ ఫాతిహ్ బిరోల్ పేర్కొన్న నేపథ్యంలో ఈ ఎస్ఎంఆర్, ఎఎంఆర్లలను కృత్రిమ మేధ సమన్వయంతో ఏర్పాటుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పరం సమన్వయంతో పని చేసేందుకు ఇరుదేశాధినేతలు అంగీకరించారు. భారత్-ఫ్రాన్స్లు మూడో ప్రపంచ దేశాలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో సమన్వయంతో కృషిచేయనున్నాయి. కృత్రిమ మేధపై ఇరుదేశాల ద్వైపాక్షిక అంగీకారం ప్రజాస్వామ్య విలువలకు, మానవాభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగుతాయి. సురక్షితమైన, భద్రతతో కూడిన కృత్రిమ మేధస్సు వ్యవస్థల వినియోగం ద్వారా 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలని , ఇందుకోసం అంతర్జాతీయ స్థాయి సహకారాన్ని పొందాలని, కృత్రిమ మేధలో సామర్థ్య నిర్మాణాన్ని సాధించాలని, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి, మానవహక్కులకు ప్రాధాన్యమిస్తూ ముందు కెళ్లాలని ఉమ్మడి ప్రకటన స్పష్టం చేసింది. స్కార్పియాన్ తరగతికి చెందిన జలాంతర్గాములను భారత్లోనే దేశీయంగా తయారు చేయాలని కూడా నిర్ణయించారు. కాగా, ప్రధాని నరేంద్రమోదీ ఎస్తానియా అధ్యక్షులు అలార్ కరిస్, యు.ఎస్. ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్తో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ట్రంప్తో ద్వైపాక్షిక చర్చలు
ఫ్రాన్స్లో పర్యటన ముగించుకొని, అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్రమో దీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, దిగుమతి సుంకాలు, 26/11 దాడులకు కారకుడైన తహవూర్ రాణా అప్పగింత, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఎఫ్-35 యుద్ధ విమానాలను భారత్కు అమ్మడం, భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. తహవూర్ రాణా తర్వాత మరిన్ని అప్పగింతలు ఉంటాయని ట్రంప్ చెప్పారు. అయితే సుంకాల విషయంలో భారత్కు మినహాయింపులేవీ ఉండ బోవని ట్రంప్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ‘ఎం.ఇ.జి.ఎ (మేక్ ఇండియా గ్రేట్ అగైన్) భాగ స్వామ్యం’ ప్రస్తావన కూడా ఈ చర్చల సందర్భంగా వచ్చింది. ట్రంప్ ఎప్పుడూ ఎం.ఎ.జి.ఎ. (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) గురించి మాట్లాడుతుంటారు. ‘వికసిత్ భారత్’కు అమెరికన్ నిర్వచనం ఇది. భారత్-అమెరికాల పరస్పర వికాసం కోసం ఎం.ఇ.జి.ఎ. భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని అన్నారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ‘మిషన్-500’ గా దీని పేరు పెట్టారు. ముఖ్యంగా ఉమ్మడి అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు, ఉమ్మడి ఉత్పత్తికి ప్రాధాన్యత నిస్తారు. దీనికి సంబంధించిన నియమ నిబంధలను 2025లోగా రూపొందించాలని నిర్ణయించారు. పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక నడవా నిర్మాణంలో పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. సుంకాల తగ్గింపుతో పాటు మార్కెట్ ప్రవేశాన్ని మరింత సులభతరం చేసేలా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవాలని భారత్-అమెరికాలు నిర్ణయించుకున్నాయి. అదేవిధంగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకోసం భారత ప్రజలు వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పారు.
యు.ఎస్.నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు
ఈ సందర్భంగా ఎఫ్-35 యుద్ధ విమానాలను భారత్కు అమ్మే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఇరుపక్షాల మధ్య చర్చల్లో ఇంధన రంగంలో కీలక ముందడుగు పడింది. భవిష్యత్తులో 25 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనాన్ని అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ కొనుగోలు ద్వారా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య లోటును చాలావరకు భర్తీ చేయవచ్చు. ఇక భారత్-చైనా వివాదంలో మధ్యవర్తిత్వం వహించేం దుకు అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ముందుకు వచ్చారు. రెండు దేశాల సైన్యాలు వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమ వలసలపై నరేంద్రమోదీ మాట్లాడుతూ, చట్టవిరుద్ధంగా మరోదేశంలో నివసించడం తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయులను తిరిగి స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోదీ స్పష్టం చేశారు.
భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూ మినియంపై ట్రంప్ ప్రభుత్వం విధించిన 25% సుంకం ప్రభావం మోదీ పర్యటనపై పెద్దగా ప్రభావం చూపలేదు. టారిఫ్ల విషయంలో ఇరుదేశాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. అమెరికానుంచి మరింత చమురు, గ్యాస్, సైన్యానికి అవసరమైన పరికరాలు భారత్ కొనుగోలు చేస్తుందని ట్రంప్ ప్రకటించడంతో, ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు కొంతస్థాయిలో తగ్గుతుంది. సుంకాల ప్రభావం మనదేశం ఎగుమతి చేసే ఔషధాలు, రత్నాభరణాలు, ఇనుము-ఉక్కు, వాహన, విద్యుత్ యంత్రాలు, జౌళి, వస్త్రాలు, ఆహారపదార్థాలపై పడుతుంది. అయితే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాత్రం భారత్పై సుంకాల ప్రభావం పెద్దగా ఉండబోదని అంటోంది. ఎందుకంటే మనదేశం ఎగుమతి చేసే వస్తువుల్లో 75%కు పైగా వస్తువులపై 5%కంటే తక్కువే దిగుమతి సుంకాలు ఉంటున్నాయి. మనదేశం నుంచి గత ఏడాది 27.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు ఎగుమతి కాగా ఇందులో 31.37% అమెరికానే దిగుమతి చేసుకుంది.
వాణిజ్య బంధ బలోపేతానికి ప్రతిన
జాతీయ ప్రయోజనాలు, ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యమిస్తూ వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ట్రంప్ ప్రతిన బూనారని సంయుక్త ప్రకటన పేర్కొంది. అమెరికా నుంచి అదనంగా ఆరు పి-8 దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాల కొనుగోలు చేయాలనే భారత ప్రతిపాదనకు ఆమోదం లభించింది. బంగ్లాదేశ్కు సంబంధించి ట్రంప్ భారత్కు పూర్తి స్వేచ్ఛనివ్వడం అత్యంత కీలక పరిణామం. పాకిస్తాన్ తమ భూభాగం నుంచి సీమాంతర ఉగ్రవాదం కొనసాగకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మోదీ- ట్రంప్లు ఉమ్మడి ప్రెస్మీట్లో కోరారు. ఉగ్రవాదంపై పోరులో తమదేశం రాజీలేని వైఖరిని అవలంబిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. మోదీ పర్యటనలో జరిగిన మరో ముఖ్య పరిణామమేంటే, ప్రస్తుతం భారత్లో అమల్లో ఉన్న అణుశక్తి చట్టంలో మార్పులు తీసుకువచ్చే అవకాశాలున్నాయి. భారత ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలన్న సంకల్పంతో ఉంది. 2008లో అమెరికాతో కుదిరిన పౌర అణు ఒప్పందం అమలుకు ప్రస్తుతం మనదేశంలోని ఈ చట్టం ప్రతిబంధకంగా మారింది. ఈ చట్టాన్ని ఎత్తేస్తే ప్రైవేటు కంపెనీలు అణు రియాక్టర్లను నెలకొల్పేందుకు వీలవుతుంది. అమెరికాకు చెందిన పలు ప్రైవేటు కంపెనీలు అప్పుడు ఇబ్బడి ముబ్బడిగా మనదేశంలో అణురియాక్టర్లను నెలకొల్పగలుగుతాయి. ఇక రెండు దేశాలు సంక్లిష్టమైన, ఉద్గమిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం విషయంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయిం చాయి. ఇందులో భాగంగా ట్రాన్సఫరింగ్ ది రిలేషన్షిప్ యుటిలైజింగ్ టెక్నాలజీ (ట్రస్ట్)ను ప్రకటించారు. దీని కింద కృత్రిమమేధ, సెమికండక్టర్లు, డేటాసెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు.
వెల్లివిరిసిన స్నేహం
శ్వేతసౌధంలో మోదీ-ట్రంప్ల మధ్య పరస్పర ఆలింగనాలు, షేక్హ్యాండ్లతో స్నేహపూరిత వాతావరణం వెల్లివిరిసింది. ట్రంప్ స్వయంగా రాసిన ‘అవర్ జర్నీ టుగెదర్’ పుస్తకాన్ని మోదీకి బహూకరించారు. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు చోటుచేసుకున్న ప్రధాన ఘట్టాలతో కూడిన ఫోటో పుస్తకం ఇది. పుస్తకంపై ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ ఆర్ గ్రేట్’ అని ట్రంప్ సంతకం చేశారు. ఫిబ్రవరి 10-12 తేదీల్లో క్షణం తీరుబడి లేకుండా సాగిన నరేంద్రమోదీ పర్యటన భారత్ పరంగా సత్ఫలితాలనిచ్చిందనే చెప్పాలి.
జమలాపురపు విఠల్రావు
సీనియర్ జర్నలిస్ట్