ఐసీసీ -2024 అవార్డుల మూడు విభాగాలలోనూ భారత క్రికెటర్లు విజేతలుగా నిలిచారు.భారత క్రికెట్ కే గర్వకారణంగా నిలిచారు. సంప్రదాయ టెస్టు ఫార్మాట్లో బుమ్రా, ధూమ్ ధామ్ టీ-20 విభాగంలో అర్షదీప్ సింగ్, మహిళల వన్డే క్రికెట్లో స్మృతి మందన తమకుతామే సాటిగా రికార్డుల్లో చేరారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి గత ఏడాది కాలానికి క్రికెట్ మూడు (టెస్టు, వన్డే, టీ-20) విభా గాలలోనూ అత్యుత్తమ టీమ్, వ్యక్తిగత అవార్డులను ప్రకటిం చింది. పురుషుల విభాగంలోని రెండు ఫార్మాట్లతో పాటు మహిళల వన్డే విభాగంలో భారత్కు మొత్తం మూడు వ్యక్తిగత విభాగం అవార్డులు దక్కాయి. సాంప్రదాయ టెస్టు క్రికెట్లో భారత వైస్ కెప్టెన్ కమ్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా, ధూమ్ ధామ్ టీ-20 విభాగంలో పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్, మహిళల వన్డేలలో ఓపెనర్ స్మృతి మందన అత్యుత్తమ ప్రదర్శనతో అవార్డు విజేతలుగా నిలిచారు.
బుమ్రాకి సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ అవార్డు…
ఐదురోజుల సంప్రదాయ టెస్టు క్రికెట్లో ప్రపంచ మేటి బౌలర్గా నిలిచిన జస్ ప్రీత్ బుమ్రా స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా అత్యుత్తమ అవార్డు గెలుచుకొన్నాడు. పురుష క్రికెటర్లకు కరీబియన్ దిగ్గజ ఆల్ రౌండర్ సర్గార్ ఫీల్డ్ సోబర్స్ పేరిట ఈ అవార్డును ఐసీసీ ప్రదానం చేస్తుంది.
గతంలో అదే అవార్డును అందుకొన్న భారత క్రికెటర్లలో భారత మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రావిడ్ (2004), మాజీ ఓపెనర్ ,ప్రస్తుత కోచ్ గౌతం గంభీర్ (2009), భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (2010), ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (2016), భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ (2018) ఉన్నారు. ఇప్పుడు.. జస్ ప్రీత్ బుమ్రా వచ్చి గతంలో ఇదే ఘనత సాధించిన ఐదుగురు దిగ్గజ క్రికెటర్ల సరసన నిలిచాడు. 2024 క్రికెట్ సీజన్లో బుమ్రా ఆడిన మొత్తం 13 టెస్టు మ్యాచ్ల్లో 71 వికెట్లు పడగొట్టడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు.
2004 సీజన్లో కేవలం 10 ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన రాహుల్ ద్రావిడ్ కళ్లు చెదిరే స్థాయిలో 100.37 సగటు నమోదు చేశాడు. 2 శతకాలు, 5 అర్ధ్థ శతకాలతో 803 పరుగులతో చరిత్ర సృష్టించి ఐసీసీ అత్యుత్తమ టెస్టు క్రికెటర్ అవార్డుకు ఎంపికైన భారత తొలి క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. 2009 సీజన్లో ఐదంటే ఐదు టెస్టులు ఆడి 4 శతకాలు, ఓ అర్ధశతకం సహా 727 పరుగులు సాధించాడు. 90.87 సగటుతో పాటు టెస్టు క్రికెట్ నంబర్ వన్ బ్యాటర్గా ఐసీసీ అత్యుత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు సాధించాడు.
2010లో సెహ్వాగ్ విశ్వరూపం….
2010 క్రికెట్ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఐదు శతకాలు, 8 అర్ధ శతకాలు సహా 1422 పరుగులు సాధించాడు. ఆఫ్ స్పిన్ బౌలర్గా 9 వికెట్లు పడగొట్టడం ద్వారా ఐసీసీ అత్యుత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు అందుకొన్న భారత మూడో ఆటిగాడిగా రికార్డుల్లో చోటు సంపాదించాడు. 2016 సీజన్లో 12 టెస్టులు ఆడిన ఆఫ్స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 72 వికెట్లు పడగొట్టడంతో పాటు 612 పరుగులు సాధించాడు. ఆల్ రౌండర్గా అశ్విన్ అత్యుత్తమంగా రాణించడం ద్వారా సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ అవార్డు సొంతం చేసుకోగలిగాడు.
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ 2018 సీజన్లో చెలరేగిపోయాడు. మొత్తం 13 టెస్టుల్లో 1322 పరుగులతో 55.08 సగటు నమోదు చేశాడు. మొత్తం ఐదు శతకాలు, ఐదు అర్ధ శతకాలతో ఐసీసీ అత్యుత్తమ టెస్టు క్రికెటర్ పురస్కారం అందుకొన్నాడు.
కురచ క్రికెట్లో అర్షదీప్ మ్యాజిక్….
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో 2024 సంవత్స రానికి ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్ అవార్డు భారత యువఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్కు దక్కింది. 25 సంవత్సరాల అర్షదీప్ 2024 సీజన్లో మొత్తం 18 మ్యాచ్లు ఆడి 36 వికెట్లు పడగొట్టాడు. 2007 తరువాత భారత్ ఐసీసీ టీ-20 ప్రపంచకప్ విజేతగా నిలవడంలో అర్షదీప్ తనవంతు పాత్ర పోషించాడు. అంతేకాదు… ఐసీసీ అత్యుత్తమ టీ-20 జట్టులో రోహిత్ శర్మ, బుమ్రా, హార్థిక్ పాండ్యాలతో కలసి అర్షదీప్ సైతం చోటు సంపాదించాడు.
శతకాల ‘రాణి ‘ స్మృతి మందన…
మహిళల విభాగంలో భారత్ కు 2024 సీజన్లో ఒకే ఒక్క ఐసీసీ అవార్డు దక్కింది. టెస్టు, టీ-20 ఫార్మాట్లలో భారత మహిళలు అవార్డులు సాధించలేక పోయినా.. 50 ఓవర్ల వన్డే క్రికట్లో భారత ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ స్మృతి మందన ఐసీసీ అత్యుత్తమ వన్డే క్రికెటర్ అవార్డు సాధించడం ద్వారా పరువు దక్కించింది. తన కెరియర్లో తొలిసారిగా 2018 సీజన్లో ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్ అవార్డు అందుకొన్న స్మృతి 2024 సీజన్లోనూ అదే సాధించడం మరో అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.
గత ఏడాదికాలంలో ఆడిన వన్డే మ్యాచ్ల్లో స్మృతి మందన రికార్డు స్థాయిలో నాలుగు శతకాలు నమోదు చేసింది. అత్యుత్తమ క్రికెటర్ అవార్డుకు జరిగిన పోటీలో శ్రీలంక కెప్టెన్ చమరీ అటపట్టు, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ లారా వూల్వార్ట్, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్లతో పోటీపడిన స్మృతి మందన అత్యుత్తమ బ్యాటింగ్ ప్రతిభతో విజేతగా నిలువగలిగింది. స్మృతి మొత్తం 13 వన్డేలు ఆడి నాలుగు శతకాలు సహా 794 పరుగులతో 57. 46 సగటు నమోదు చేసింది. న్యూజిలాండ్ ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్ సుజీ బేట్స్ రెండుసార్లు ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్ అవార్డు అందుకొన్న తొలి మహిళ కాగా..ఇప్పుడు స్మృతి మందన వచ్చి చేరింది.
ప్రస్తుత ప్రపంచ క్రికెట్కు చిరునామాగా నిలిచిన భారత్ మూడు విభాగాలలో ఐసీసీ అవార్డులు సాధించడంతో పాటు..2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ చాంపియన్గా నిలవడం అభినంద నీయం.
కృష్ణారావు చొప్పరపు
సీనియర్ జర్నలిస్ట్,