ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ అనే నాణేనికి మంచీ చెడూ రెండూ కూడా బొమ్మాబొరుసుల్లా ఉన్నాయి. ఏఐని వినియోగించడంలో భద్రతా ఏజెన్సీలు ఎంతో చురుకుదనాన్ని ప్రదర్శిస్తుండగా, మానవాళికి ముచ్చెమటలు పోసేలా తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా టెర్రరిస్టులు సైతం వారి కార్యకలాపాల్లో ఏఐ ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఏఐ ఆగమనంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటిదాకా మనం వాడుతూ వస్తున్న అన్ని టెక్నాలజీల్లాగానే ఏఐతో ప్రయోజనాలూ ఉన్నాయి, ఇబ్బందులూ ఉన్నాయి. అయితే అది మనం దాన్ని ఎలా వాడుకుంటామనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఏఐ ప్రాముఖ్యతను గుర్తెరిగిన అగ్ర రాజ్యాలు ఏఐ అనుబంధిత అభివృద్ధి కార్యక్రమాల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి.
మన వరకు చూస్తే.. ఏఐని వాడుకోవడంలో భారత సైన్యం ముందంజలో ఉంది. జాతీయ భద్రత, రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడం కోసమని ఈ టెక్నాలజీని వినియోగించుకుంటోంది. అయితే అదే సమయంలో ఇస్లామిక్ స్టేట్ లాంటి టెర్రరిస్టు మూకలు సైతం ఈ టెక్నాలజీని అందిపుచ్చుకున్నాయి. గత కొద్ది మాసాలుగా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఈ ముష్కర మూకలు తమ స్వార్థం కోసం ఏఐని ఎలా వాడుకున్నదీ తేటతెల్లం చేశాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రానున్న రోజుల్లో మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటానికి ఏఐ ఓ సాక్షిగా మారనుంది. ఇంకా చెప్పాలంటే టెక్నాలజీని వాడుకోవడంలో ఆధిపత్య పోరు ఆకాశాన్నంటుతుంది. ప్రపంచానికి ముప్పు చేయడానికి ఉగ్రమూకలు ఏఐని వాడుతుంటే, ఆ ముప్పును మొగ్గలోనే తుంచేయడానికి భారత సైన్యం అత్యంత సమరో త్సాహంతో కొత్త టెక్నాలజీని వినియోగిస్తోంది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించివేయడానికి తన శక్తి సామర్థ్యాలను ఏఐ తోడుగా పెంచుకుంటోంది. టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది.
సంక్లిష్టమైన ముప్పులను ఎదుర్కోవడంలో టూల్స్ వినియోగిస్తోంది. మన సైన్యం ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ – ఓఎస్ఐఎన్టి, బిగ్ డేటా, జనరేటివ్ ఏఐ లాంటి టెక్నాలజీలను వాడుతోంది. ఈ టెక్నాలజీలు సైన్యానికి రియల్ టైమ్ పరిజ్ఞానాన్ని, భవిష్యత్ దర్శనం చేయిస్తాయి. ఇది సరైన నిర్ణయం తీసుకోవడంలో, సకాలంలో స్పందించడంలో, ముప్పును గుర్తించడంలో ఎంతగానో ఉపయోగపడు తుంది. జాతీయ భద్రతను మరింత పటిష్టపరచడంలో ఏఐ ప్రాధాన్యతను భారత సైన్యం గుర్తించింది. భారతీయ బలగాలు ఓ పక్క వాటి సైబర్ భద్రతను మెరుగుపరుచుకుంటూనే మరో పక్క నిఘాను యాంత్రీకరణ చేసుకున్నాయి.
సైన్యంలోకి ఏఐ రాకతో మూడు సమ్మిళిత కమాండ్లు కాస్త అత్యంత శక్తిమంతమైన డేటా డ్రైవ్ హబ్లుగా అవతరించాయి. ఇది నింగీ నేలా నీటిపైన అనుసంధాన కార్యకలాపాలకు సాయపడింది. ఈ ఏకీకరణ మిలటరీ కమాండర్లకు రియల్ టైమ్ ప్రతిస్పందనను సమకూర్చడానికి తోడు మంచి సమన్వయం, సత్వరం నిర్ణయాలు తీసుకోవడానికి దారి చూపింది.
సైన్యంలో మానవ వనరులను తగ్గించాలనే మాట వినపడుతున్న సమయంలో అడుగుపెట్టిన ఏఐ అన్ని విషయాల్లోనూ ప్రాభవాన్ని చాటిచెపుతోంది. వామనుడిలా పాదం మోపిన ఈ టెక్నాలజీ అత్యంత బలశాలి అయిన త్రివిక్రముడిలా నేడు అవతరిం చింది. సైన్యం ఏఐ తోడుగా కొద్దిపాటి మానవ వనరులతోటే మరింతగా సాధించగలదు. ఈ టెక్నాలజీ కొండంత భారాన్ని అవలీలగా మోసి అవతల పడేస్తుంది. సైన్యంలో రోజువారీ లక్ష్యాలను చిటికెలో పూర్తి చేస్తోంది. సైన్యం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో సాయపడుతోంది. పోరాట సంసిద్ధతను సైతం ఏఐ మెరుగుపరుస్తోంది.
ఏఐ నాణేనికి మరోవైపు..!
ఏఐని భద్రతా ఏజెన్సీలు వినియోగించుకోవడం ఓ స్వాగతించాల్సిన పరిణామం. అదే సమయంలో ఏఐ నాణేనికి మరోవైపు ఓ చీకటి కోణం ఉంది. ఈ మధ్యకాలంలో ఉగ్రమూకలు మరీ ముఖ్యంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇస్లామిక్ స్టేట్ కొత్త ఊపిరి పోసుకోవడానికి ఏఐని విపరీతంగా వాడుకుంటోంది. ఈ ఉగ్రమూక ప్రస్తుతానికి ఈ టెక్నాలజీని ప్రచారానికి వినియోగిస్తోంది. తొలి ప్రయోగం అన్నట్టుగా ఇటీవల ఏఐ ఆధారిత వార్తా బులెటిన్ను ఇస్లామిక్ స్టేట్ క్రియేట్ చేసింది. ఆ బులెటిన్లో ఏఐ ద్వారా క్రియేట్ అయిన న్యూస్ ప్రజెంటర్ ఇస్లామిక్ స్టేట్ మతోన్మాదాన్ని ప్రచారం చేసే వార్తలను చదువుతుంటుంది.
అయితే ఇలాంటి మతోన్మాద ఉగ్రమూకలు ఏఐ వాడటాన్ని కేవలం వాటి ప్రచారంతోనే సరిపెట్టు కోవనేది నిపుణులు అంటున్న మాట. ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే ఈ టెక్నాలజీతో తన ఉగ్ర కార్యకాలాపాలను సాగించడానికి మార్గాలను అన్వేషిస్తోంది. దాని అన్వేషణ ఫలించిన పక్షంలో ఇస్లామిక్ స్టేట్ ఏ భద్రతా ఏజెన్సీలూ, ఏ రకమైన నిఘా ఏజెన్సీలు కనిపెట్టడానికి వీల్లేదని విధంగా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్రాఫిక్ వ్యవస్థ హ్యాకింగ్తో ఉగ్రదాడులు
ఉగ్రమూకలు రిమోట్ కంట్రోల్డ్ వాహనాలతో దాడులు జరపడానికి ఏఐని వాడటానికి ప్రయత్ని స్తున్నాయనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంలో ఇస్లామిక్ స్టేట్ అత్యంత దారుణంగా ఆలోచిస్తోంది. ట్రాఫిక్ నియంత్రణకు ఉద్దేశించిన వ్యవస్థలను హ్యాక్ చేయడానికి దారులు వెతుక్కుంటోంది. దానికే కనుక ఓ దారి దొరికిన పక్షంలో అది జరిపే దాడుల్లో ప్రాణ నష్టం అపారంగా ఉంటుందనే విషయం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఇటీవల తెలిసివచ్చింది.
ఏఐ చాట్బోట్లతో మతోన్మాద ప్రచారం
ఇస్లామిక్ స్టేట్ చేతిలో ఉన్న అత్యంత ప్రమాద కరమైన ఆయుధం మతోన్మాద ప్రచారం. ఈ ఉగ్రమూకకు కీలకమైన ఇరాక్, సిరియాలో నిలువనీడ లేకుండా పోయినప్పుడు అది తన కోసం పనిచేస్తున్న విదేశీ ఉగ్రవాదులను వారి స్వదేశానికి వెళ్లి ఒంటరి తోడేలు తరహాలో దాడులకు పాల్పడాలని ఆదేశిం చింది. ఇలాంటి దాడులకు పెద్దగా ఖర్చుండదనేది ఉగ్రమూకల భావన. అయితే మతోన్మాద ప్రచారం ఎంత ప్రభావితంగా చేసారనేదానిపై ఈ తోడేలు తరహా దాడులు ఆధారపడి ఉంటాయి. సరిగ్గా ఇక్కడే ఉగ్రమూకలకు ఏఐ ఉపకరిస్తోంది. మతోన్మాద ప్రచార సామాగ్రి ప్రధానంగా అరబిక్ భాషలో ఉంటుంది.
ఏఐ ఆగమనంతో అరబిక్ ప్రచార సామాగ్రిని ప్రపంచంలో వాడుకలో ఉన్న అన్ని భాషల్లోకి అనువదించి కావలసినంత మందికి బ్రాడ్కాస్ట్ చేసే అవకాశం ఉంది. ఉగ్రమూకలు కొత్త టెక్నాలజీతో ఆన్లైన్ ద్వారా కొత్తవారిని నియమించు కుంటున్నాయి. పథక రచన చేస్తున్నాయి. ఏఐ ఆధారిత చాట్బోట్ల ద్వారా వ్యక్తులను మతోన్మాదం వైపు ప్రేరేపిస్తున్న వైనం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అయితే మాయలమరాఠీ తరహాలో పూటకో రూపం మార్చుకుంటున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కో వడంలో భారత్ సహా ప్రపంచదేశాలు అంతే ధీటుగా క్షణక్షణం వ్యూహాలు మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఏఐ ఊతంగా అంతే సమర్థమంతంగా ముంచుకొస్తున్న ముప్పును తిప్పికొడుతుందని ఆశిద్దాం.
– జాగృతి డెస్క్