(బలిదానమై 500 సం.లు పూర్తి)

రాణి దుర్గావతి పేరు వినగానే నారీశక్తికి ఉన్న గౌరవం గుర్తుకు వస్తుంది. స్వధర్మం కోసం, దేశం కోసం, మాతృభూమి గౌరవం నిలబెట్టేందుకు, పేరులోనే కాదు చేతల్లోనూ దుర్గామాత అవతారం ఎత్తిన రణచండి ఆమె. రూపంలో, గుణంలో, ధన వైభవంలో ఆమెకు ఆమె సాటి. వీర పురుషులు ఉన్నట్టే వీరాంగనలు కూడా భరత చరిత్రను సాహసోపేతంగా మలిచారు. నిపుణత కల్గిన యోధురాళ్లు ఝూన్సీ లక్ష్మీబాయి, రాణి చెన్నమ్మ, రాణి అవంతిబాయి, అహల్యాబాయి హోల్కర్‌ ‌సరసన రాణి దుర్గావతి చేరతారు. ఆమె వనవాసుల్లో గోండు తెగకు చెందిన స్త్రీ. గోండు రాణిగా ప్రసిద్ధి కెక్కింది. జీవితంలో పరాజయం చూడని ధీరవనిత. మాతృభూమి రక్షణ కోసం అంతిమ క్షణం వరకు పోరాడింది. మొగలులతో పోరాటంలో ఆమె అగ్రేసరురాలిగా నిలిచింది. ఆమెది బహుముఖ వ్యక్తిత్వం. తన ప్రజలకు తల్లిలా, పరిపాలనలో చక్కటి శాసకురాలిగా, శత్రువుల పాలిట సింహస్వప్నంలా భాసించింది.

మొగలుల పరిపాలనలో ఇతరులు స్వాభిమానంతో జీవించడం నేరం. అక్బరుకు అందరు హిందురాజులు దాసోహమన్నారు. కానీ వైధవ్యంతోనూ ఓ రాణి చక్కటి పాలన అందించడం అక్బరుకు కంటగింపైంది. తనను శరణువేడ మన్నాడు. ససేమిరా అన్నదామె. ఆమె సబల. యుద్ధంలో 3 సార్లు ఓడిపోయాడు అక్బరు. జీవితకాలంలో ఆమె 52 యుద్ధాలు చేసింది. 51 యుద్ధాల్లో గెలిచింది. అదైనా ముస్లింల కూట యుద్ధనీతి కారణంగా ఆమె ఓడింది. శత్రువు చేతిలో తన శరీరం పడకూడదని తనకు తానుగా ఆత్మాహుతి చేసుకుంది. ఆమె సందేశం మేరకు అక్బరుకు వశం కాకుండా 5000 మంది గోండు మహిళలు ఆత్మాహుతి చేసుకున్నారు.

నారీవాహిని నిర్మాణం చేసింది. అక్బరు తరువాత యుద్ధంలో గెలిచివుండవచ్చు. కాని పరాక్రమం చూపి స్వాభిమాన సందేశం ఇచ్చి జయకేతనం ఎగుర వేసింది మాత్రం రాణి దుర్గావతి. ఆమె గోండు రాణిగా కాక దేశానికే రాణి అయింది. గోండు జాతి హిందూ సమాజంలో అంతర్భాగం అని ప్రకటించింది. జబల్పూర్‌లోని దుర్గావతి పరిశోధన సంస్థ, ఆమె బలిదాన స్థలం నుంచి జన్మస్థలం వరకు అనేక పురావస్తు శిథిలాలను, ఆధారాలను సేకరించి భద్రపరచింది. జబల్పూర్‌ ‌విశ్వవిద్యాలయం పేరును రాణి దుర్గావతి విశ్వ విద్యాలయంగా మధ్యప్రదేశ్‌ ‌ప్రభుత్వం నామాంతరం చేసింది. 1988లో కేంద్ర ప్రభుత్వం రాణి దుర్గావతి స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది.

ఇది సుమారు 500 సంవత్సరాల నాటి చరిత్ర. అవి దసరా నవరాత్రులరోజులు. ఆ రోజు దుర్గాష్టమి. మహారాణి కమలాదేవి ప్రసవవేదన పడుతున్నది. ఆమె భర్త కీర్తి దేవసింహుడు కాలింజర్‌ ‌కోట (ఉత్తరప్రదేశ్‌) ‌సమీపంలోని దుర్గామందిరంలో పూజ చేయించి తిరిగి వస్తున్నారు. భావి సామ్రాజ్యాధి నేత ఎవరు అవుతారో కమలాదేవి ప్రసవిస్తే తెలుస్తుంది. రాజు జ్యోతిష్యులతో మంతనాలు జరిపాడు. ఇంతలో ఎవరో పరుగెత్తుకొచ్చారు. ‘మహారాజ జయం! మహారాణి ఒక సుందరమైన పుత్రికకు జన్మనిచ్చింది’ అని రాజు చెవిన వేశారు. మహారాజు ప్రథమ సంతానం పట్ల ఆనందపడ్డాడు. అక్టోబరు 5, 1524 దుర్గాష్టమి నాడు ఆమె పుట్టింది. కనుక దుర్గావతి అని నామకరణం చేశారు. ఆమె పూర్వికులు కూడా గొప్ప యుద్ధ వీరులు. చిన్న తనంలోనే ఆమె అస్త్ర శస్త్రాలను అభ్యసించడం మొదలయింది. కత్తి తిప్పడంలో సిద్దహస్తురాలైంది. 13-14 సంవత్సరాలకే అడవుల్లో పడి జంతువులను వేటాడే సాహసం చేసింది. ఈ సమయంలో హిందూ రాజులు పరాక్రమం చూపినా పరాజయాల పాలవుతున్న కాలం మొదలయింది. అనేక మంది హిందూ రాజుల అస్తిత్వం ప్రశ్నార్ధకమై వారు మొగలులను శరణుజొచ్చారు. అంతా తమ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ విపత్కర పరిస్థితిలో దుర్గావతి జన్మించింది. 10 సంవత్సరాల వయసున్నపుడు, ఒక ఏనుగు ఆ గ్రామంలో పరుగెడుతూ అందరినీ భయపెడ్తుంటే దుర్గావతి ఆ ఏనుగును పట్టుకుంది. నియంత్రించింది. అంతా ఆశ్చర్యపోయారు. ‘అమ్మా! నువ్వు దేవతవు తల్లీ! అందపెద్ద దానిని ఆడిస్తున్నావు’ అన్నారు. ‘ఇది మన దేవత, సైనికుడు కూడా, దీనికి భయ పడడం దేనికి’ అని దుర్గావతి ప్రశ్నించింది. కొంతసేపటి క్రితం అందరినీ భయపెట్టిన ఏనుగు ఇపుడు గణేశుడుగా ఎలా మారిపోయిందా అని అందరూ ఆశ్చర్యపడ్డారు.

ఒకరోజు దుర్గావతికి ఒక సందేశం వచ్చింది. సమీప గ్రామంలోకి ఒక సింహంవచ్చి అనేక మందిని చంపివేసిందన్న వార్త అది. దుర్గావతి తండ్రి వద్దకు వెళ్లి ఆ సింహాన్ని చంపేందుకు వెళుతున్నట్లు చెప్పింది. తండ్రి దుర్గావతి సహచరి రామచేరిని కూడా తోడు పంపాడు. ఒక ఎత్తైన ప్రదేశం నుంచి దుర్గావతి చాలాసేపు సింహం రాక కోసం నిరీక్షించింది. కాని ఎంతకీ సింహం రాక పోయేసరికి క్రిందకి దిగింది. అనుకోకుండా సింహం ఎదుటపడేసరికి ఏ మాత్రం భయపడకుండా విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించింది. ఆ బాణం సింహం మెడకు గుచ్చుకుని అది నేల కూలింది. ఈ ఘటన విషయం అందరికీ తెలిసింది. తన కూతురు ప్రావీణ్యాన్ని చూసి తండ్రి ఆనందించాడు. 500 ఏళ్లకు పూర్వం ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా అటువంటి స్వేచ్ఛనిచ్చారు.

దుర్గావతికి ఎలాంటి వరుణ్ణి తేవాలి అని తల్లిదండ్రులు ఆలోచించారు. రాజా సంగ్రామసింగ్‌ ‌కొడుకు దళపత్‌ ‌షాహ్‌ ‌ప్రస్తావన వచ్చింది. ఒకసారి దుర్గావతి ఆమె సహచరి రామ్చరి కలిసి దుర్గామందిరం వెళ్లారు. మాట్లాడుకుంటూ మనీయగఢ్‌ ‌ప్రదేశం క్రింద పారుతున్న కేన్‌ ‌నదిని సమీపించారు. అక్కడ కొందరు భక్తులు స్నానం చేస్తున్నారు. కొందరు పాటలు పాడుతున్నారు. ఇంతలో ఒక్కసారిగా అందరూ పరుగెత్తడం మొదలెట్టారు. తీరా చూస్తే నదికి ఆవల తీరంలో సింహం కనబడింది. కొంతసేపటికి అది అదృశ్యమైంది. మరునాడు కూడా దుర్గావతి గుడికి వెళ్లి, తిరిగి వచ్చేటపుడు అడవి దారి పట్టింది. కొంతసేపటికి అడవిలో అలజడి కనబడింది. వెంటనే విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించింది. బాణం అక్కడ వున్న సింహం మెడలో దూరింది. అదే సమయంలో మరో పురుషుడు కూడా అక్కడ తిరుగాడుతూ బాణం సంధించాడు. దగ్గరికి వెళ్లి చూశాడు. సింహం మెడలో రెండు బాణాలున్నాయి. మరొకటి ఎవరిదని ఆలోచించాడు. ఎదురుగా దుర్గావతిని చూశాడు. ఆ పురుషుడే దళ్పత్‌ ‌షాహ్‌. అదే సమ ఉజ్జీ అంటే, అపుడే వారిద్దరికి పరిచయమైంది. కులం, వంశం, మర్యాద వారి పరిచయానికి అడ్డు రాలేదు. దుర్గావతి భవానీమాతను ప్రార్థించింది. ‘నాకు నువ్వే తల్లివి, నా చిన్నపుడే నా తల్లి చనిపోయింది. నాకు భారతీయ నారీ పరంపరను కొనసాగించే శక్తినివ్వు’ అన్నది. నీ అనుమతి ఉంటే, ఆశీర్వచనం ఉంటే నేను దళ్పత్‌ ‌షాహ్‌ను వివాహం చేసుకుంటాను అన్నది. గోండ్వానా రాజ్యం రాజు సంగ్రామ సింహుడ్ని తండ్రితో కూడి కలిసింది దుర్గావతి. సంగ్రామ సింహుడు రాణి దుర్గావతి కోడలుగా రావడానికి సుముఖత వ్యక్తపరిచాడు. మందిరంలో దుర్గావతి దళ్పత్‌ ‌షాహ్‌ ‌గాంధర్వ వివాహం జరిగింది.

తరువాత సంగ్రామసింహుడు తమ రాజ్యంలో గౌరవంగా వారి వివాహం జరిపించాడు. వివాహం తరువాత షేర్‌షా సూర్‌ ‌కలింజర్‌ ‌మీద ఆక్రమణ చేశాడు. అపుడు దుర్గావతి గర్భవతి. సంగ్రామసింహుడు ఆయన అల్లుడు దళ్పత్‌ ‌షాహ్‌తో కలిసి షేర్‌షా సూర్‌ని ఎదుర్కొ న్నాడు. దీనికి యుద్ధ వ్యూహం అంతా రాణి దుర్గావతి సిద్ధం చేసింది. ఆ యుద్ధంలో షేర్షా ఓడిపోయాడు. చనిపోయాడు. గోండు వంశ సంస్కారాలను విధానాలను ఆమె పుణికి పుచ్చుకుని జీవనం సాగించింది. కుమారుడు కలిగాడు. అతని పేరు వీర నారాయణ్‌. ‌కుమారుడు కల్గిన 2, 3 ఏళ్లకు దళ్పత్‌ ‌షాహ్‌ ‌రోగగ్రస్తుడయ్యాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రాణం దక్కలేదు. దుర్గావతి భర్తను కోల్పోయింది. ఇదొక విచిత్ర పరిస్థితి. మొగలాయిల కళ్లు రాణి దుర్గావతి మీద పడ్డాయి. రాణి దుర్గావతి రాజ్యభారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె మంత్రులు అధరకాయిసా, మన్‌ ‌ఠాకూర్‌లు సహాయపడ్డారు. పతి చనిపోయిన తరువాత ఆమెను సహగమనం చేయమన్నారు. కాని రాజ్యం కోసం, ప్రజల కోసం ధర్మం కోసం ఆమె ఆ పని చేయలేదు. ఆమె రక్షణ కోసం చౌరాఘడ్‌కు చేరింది. అక్కడి నుంచి రాజ్యపాలన చేసింది. అది తెలిసి మాల్వారాజు బాద్‌ ‌బహుదూర్‌ ఆమె రాజ్యంపై ఆక్రమణ చేశాడు. దుర్గావతి అతన్ని ఓడించింది. అతను సైన్యంతో పారిపోయాడు. చాలామంది రాజులు ప్రయత్నం చేశారు. సఫలం కాలేదు. రాణి దుర్గావతి కంటే 16, 17 సంవత్సరాల చిన్నవాడు అక్బరు. మాల్వాను అక్రమించిన తరువాత అక్బరు ఆమెను ఓడించాలను కున్నాడు. తన రాజ్యానికి రాణిని చేయాలన్న చపలత్వంలో ఉన్నాడు. అక్బరు గురించి చరిత్రలో గొప్పగా చెప్పారు. కాని అక్బరు ఆయన సేనానులు ఏ రాజ్యంలో ఏ హిందూ మహిళ కనపడినా రాజభవనంలో బంధించేవారు. అక్బరు తన సేనాపతి అసఫ్‌ అలీఖాన్‌ను పంపాడు. దుర్గావతిని శరణు వేడమన్నాడు. దుర్గావతి ససేమిరా అంది. 3 సార్లు అతన్ని యుద్ధంలో ఓడించింది. ‘మేము ఏనాడు బానిసలుగా మారం. చివరి క్షణం వరకు మేము పోరాడుతాం. మేము భారతీయ స్త్రీలం’ అని దుర్గావతి జవాబిచ్చింది.

రాణి దుర్గావతి సమకాలీనుడైన మొగలు సుబేదార్‌ ‌మాజరఖాన్‌ ‌గోండా రాజ్యంపై విరుచుకు పడ్డాడు. దుర్గావతి సేనాని అర్జున్‌దాస్‌ ‌వాస్‌ ‌ప్రాణాలు విడిచాడు. అందువల్ల దుర్గావతి సైన్యాధిపత్యం వహించి మొగలు సేనల్ని తిప్పి కొట్టింది. మొగలు సేనలు పారిపోయాయి. మొగలు సేనలపై రాత్రి వేళ యుద్ధం చేద్దామని దుర్గావతి ప్రణాళిక రచిస్తే ఆమె సహచర సైనికాధికారులు అలా వద్దన్నారు. నాల్గవసారి అసఫ్‌ అలీఖాన్‌ ‌పెద్ద ఎత్తున సైన్యంతో వచ్చాడు.

రాణి దుర్గావతి సర్మన్‌ ‌పేరు గల తన ఏనుగునెక్కి యుద్ధం చేస్తున్నది. మొగలు సేనలు పారిపోవడం మొదలైంది. రాణి సేన కూడ నేల కొరగడం మొదలయింది. తనకేమైనా జరిగితే తన శరీరాన్ని మొగలులకు అప్పగించవద్దని తన సేనాపతిని కోరింది. ఆమె కొడుకు కూడా యుద్ధం చేస్తున్నాడు. అతనికి చాలా గాయా లయ్యాయి. దుర్గావతి కొడుకును వేరే సురక్షిత ప్రదేశానికి తీసుకు వెళ్లమంది. మనం ఓడిపోతే మన సైనికుల భార్యలకు సహగమనం చేసేందుకు వ్యవస్థ చెయ్యమని కొడుకుని ఆదేశించింది. ఆమె ఏనుగు రాణిమాకు రక్షణనిస్తూ, ఆమె కనబడకుండా నేలకొరిగింది. రాణి  మెడమీద, కళ్లలోనూ బాహువుల మీద కూడా బాణాలు గుచ్చుకున్నాయి. రాణి దుర్గావతి అప స్మారకంలోకి వెళ్లిన మరుక్షణం తమ వద్దకు తీసుకు రమ్మని అసఫ్‌ అలీఖాన్‌ ఆదేశించాడు. కాని రాణి కనిపించలేదు. గన్ను అనే ఒక యోధుడు రాణి ఉనికి అక్బరుకు తెలియపరచాలనుకున్నాడు. రాణి దుర్గావతి వ్యూహాన్ననుసరించి జబల్పూర్‌కు 11 కి.మీ. దూరంలో బరేలి గ్రామం వద్ద గల కాలువను దాటి పర్వతాలపైకి వెళ్లి ఆమె సేనలు అక్బరు సేనలతో గెరిల్లా యుద్ధం చెయ్యాలని అనుకున్నారు. ఆ వ్యూహం తెలిసిన గన్ను అక్బరు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ‘మరి దీనికి ఏం చేయాలో నువ్వే చెప్పు అని అక్బరు అతన్ని గద్దించాడు.

అపుడు ఆ యోధుడు ‘కాలువ కట్టలు తెంచితే రాణి దుర్గావతి ఆమె సేనలు మీ వశమవుతాయి అని చెప్పాడు. ‘ఆ పని నువ్వే చెయ్యి’ అని అక్బరు ఆదేశించాడు. అతను వెళ్లి ఆ కాలువ గట్లు తెంచాడు. వరదముంచెత్తింది. అపుడు రాణి వద్ద 300 మంది సైనికులున్నారు. అంతా మొగలు సేనల చక్రబంధంలో చిక్కుకున్నారు. రాణి దుర్గావతికి అంతిమ ఘడియలు సమీపించి తన శిరసును ఖండించమని సైనికుల్ని ఆదేశించింది. కాని ఎవ్వరూ అందుకు సాహసించలేదు. అపుడు రాణి తన వొర నుంచి కత్తిని తీసి ఆత్మార్పణ చేసుకుంది. ఆమె వయసు 40సం. ఈ విషయం తెలిసిన ఆమె కొడుకు వీరనారాయణ 5000 మంది గోండు వీరుల సతుల సహగమనానికి వ్యవస్థ చేశాడు. జూన్‌ 24, 1564 ‌నాడు ఆమె వీరమరణం పొందింది. జబల్పూరు 12 కి.మీ. దూరంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె స్మారక చిహ్నం జబల్పూర్‌ ‌మండల రహదారిపై భర్యాల సమీపంలోని నార్యానా వద్ద ఆమె అమరత్వం పొందిన అదే స్థలంలో నిర్మించారు.

భారత్‌మాతాకీ జై…

-టి.హనుమత్‌ ‌ప్రసాద్‌

‌మేనేజ్‌మెట్‌ ‌కన్సల్టెన్సీ

About Author

By editor

Twitter
YOUTUBE