‌ప్రభుత్వం మారినా ఆలోచనలు మారలేదు. సర్కారు బదలాయింపు జరిగినా చేతల్లో మార్పులు కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఫక్తు వ్యాపార సంస్థలుగా వ్యవహరించే పరిస్థితులు వచ్చాయి. గత ప్రభుత్వాలు చేశాయి కదా.. అదే కొనసాగిద్దాం.. అన్న ధోరణి స్పష్టంగా గోచరిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీరు గత సర్కారు హయాం స్మరణకు వస్తోంది.

తెలంగాణలో సర్కారు భూముల అమ్మకాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో రూపొందించిన మేనిఫెస్టోల్లో అంశాలు, బహిరంగ సభల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సంపదను సమకూర్చుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. ప్రధానంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలతో మేనిఫెస్టో రూపొందించింది. వాటన్నిటిని హామీలు అమలు చేయాలంటే నిధుల సమీకరణ తప్పనిసరి. అందుకే వేలం వేయడానికి అనువైన ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో ప్రభుత్వం పడింది. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు, వాటికి డిమాండ్‌ ఉన్నట్లు గుర్తించింది. ముఖ్యంగా హైదరాబాద్‌ అవుటర్‌ ‌రింగ్‌రోడ్డు లోపల ప్రభుత్వ భూములు దాదాపుగా లేవని, ఓఆర్‌ఆర్‌ ‌నుంచి ఆర్‌.ఆర్‌.ఆర్‌. ‌మధ్య ఉన్న భూములపై దృష్టి సారించారు. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను వేలం వేయడం ద్వారా 14వేల కోట్ల రూపాయలు సేకరించింది.

ఇప్పుడు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం భూములు వేలం వేసేందుకు అదే తీరులో కసరత్తు చేస్తోంది. సంక్షే•మ పథకాలు అమలు చేయాలంటే .. నిధుల సమీకరణకు భూములు విక్రయించడమే సులభమైన మార్గమని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నిర్ణయానికి వచ్చేశారు. హైదరాబాద్‌ ‌శివారు జిల్లాలతో పాటు ఎక్కువ ఆదాయం వచ్చేందుకు అవకాశమున్న జిల్లాల్లో విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు లేఅవుట్లు డెవలప్‌ ‌చేస్తే వచ్చే ఆదాయాలపై ప్రభుత్వం ఇప్పటికే అంచనాలు వేసింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. భూములు, ప్లాట్ల విక్రయాల్లో జిల్లాల్లోని రెవెన్యూ, ఇతర విభాగాలకు పూర్తిస్థాయిలో సామర్థ్యం లేకపోవడంతో హెచ్‌ఎం‌డీఏ, టీఎస్‌ఐఐసీ సంస్థల సేవలను వినియోగించుకోనుంది. ము•మంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకానికి వీలున్న భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా హెచ్‌ఎం‌డీఏ, టీఎస్‌ఐఐసీ పరిధిలో ఉన్న భూములపై ఫోకస్‌ ‌పెట్టాలని నిర్ణయించారు.

భూముల విక్రయం ద్వారా కోట్ల రూపాయలు గడించి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు బీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ అమలు చేసిన వ్యూహాన్నే ప్రస్తుతం రేవంత్‌ ‌సర్కార్‌ అనుసరిస్తోంది. ఆరు గ్యారెంటీల అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రేవంత్‌రెడ్డి, అందుకు అవసరమైన ఆర్థిక వనరులపై దృష్టి సారించారు. గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా నిధుల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఆటంకాలు లేకుండా ఉండేలా ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతుల పంట రుణమాఫీ కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయని భావిస్తున్న సీఎం, అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడం కంటే భూములను విక్రయిస్తే సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే భూముల విక్రయానికి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చారు.

ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ – ‌రీజనల్‌ ‌రింగ్‌రోడ్‌కు మధ్య ఉన్న ప్రభుత్వ భూములు, వాటితో పాటు భూ సమీకరణలో భాగంగా రైతులు ముందుకొస్తే ఆయా భూములను కూడా అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. అటు అభివృద్ధి- ఇటు ఆదాయం.. ఉభయతారకంగా ముందుకెళ్లాలని భావిస్తోంది. ఓర్‌ఆర్‌ఆర్‌- ఆర్‌ఆర్‌ఆర్‌ ‌మధ్య కూడా భారీగానే ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ అభివృద్ధి ప్రణాళిక ఎలా ఉండాలన్న దానిపైనా ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌ ‌శివారు మహేశ్వరంలోని ఫార్మాసిటీ భూముల గురించి కూడా సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫార్మాసిటీని 19,300 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించగా, అందులో ప్రభుత్వానిదే 9,133 ఎకరాల భూములు ఉన్నాయి. దానికితోడు రైతుల నుంచి నాలుగువేల ఎకరాలు సేకరించారు. ఈ భూముల్లో గత ప్రభుత్వ హయాంలోనే రోడ్లు, నీరు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలనూ కొంతమేరకు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చాక.. ఆ భూముల్లో ఫార్మాసిటీ కాకుండా టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని, అలాగే కాలుష్య రహిత పరిశ్రమలను తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఫార్మాసిటీ భూములకు సంబంధించి ప్రభుత్వం భారీ ప్రణాళికనే రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఫార్మాసిటీ భూముల్లో మల్టీ మోడల్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌జోన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఫార్మాసిటీ క్లస్టర్లను నగరానికి దూరంగా వేర్వేరు చోట్ల అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో రంగారెడ్డి జిల్లా కందుకూరు, కడ్తాల్‌, ‌యాచారం మండలాల్లో సేకరించిన భూములు ప్రభుత్వానికి అందుబాటులోకి రానున్నాయి. వాటిలో నివాస టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయడం కోసం కొంత భూమిని వేలం వేయడం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం లాంటి అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే కొంతమేర వివిధ రంగాలకు చెందిన భూమిని పరిశ్రమలకు కేటాయించే అవకాశముంది. కొంత భూమిని హెల్త్ ‌సిటీ కోసం.. అంటే ప్రైవేటు ఆస్పత్రులకు కూడా భూ కేటాయింపు చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ జరిగే అభివృద్ధిలో ఉద్యోగాల కల్పన కూడా ఉండాలని.. అలా ఉంటేనే నివాస సముదాయాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఫార్మా సిటీ భూముల్లో హెల్త్‌సిటీ, పారిశ్రామిక సంస్థలు.. అదేవిధంగా కొంత మేర కాలుష్య రహిత ఫార్మా కంపెనీలకు కూడా భూములు కేటాయించే అవకాశాలు న్నాయి. ఈ భూములపై కూడా ప్రభుత్వానికి భారీగా నికర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఒక్క హెచ్‌ఎం‌డీఏ పరిధిలో ఉన్న 7 జిల్లాల్లోనే 8,260 ఎకరాలు ఉంది. ఇందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 7,452 ఎకరాలు, హైదరాబాద్‌ ‌జిల్లాలో 299 ఎకరాలు, మెదక్‌ ‌పరిధిలో 558 ఎకరాల భూమిని హెచ్‌ఎం‌డీఏకి కేటాయించారు. ఇందులో సుమారు 3,886 ఎకరాల వరకు ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించారు. ఇంకా సుమారు 4,374 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు హెచ్‌ఎం‌డీఏ వెబ్‌సైట్‌ ‌ద్వారా తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే అత్యధికంగా 3,899 ఎకరాలుండగా, హైదరాబాద్‌ ‌పరిధిలో 37 ఎకరాలు, మెదక్‌ ‌పరిధిలో 437 ఎకరాలుంది. అయితే ఇవన్నీ పాత లెక్కలే. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో వీటిలో కొన్ని భూములను పలు అవసరాల కోసం కేటా యించారు. మరికొన్నింటిని వేలం వేశారు. 3వేల ఎకరాలకు పైగా న్యాయ వివాదాల్లో ఉన్నాయి. వీటి పరిష్కారంపైనా సర్కారు దృష్టిపెట్టింది. ఇక ఇప్పటికిప్పుడు ఏ ఇబ్బందులూ లేకుండా ఉన్న భూముల వివరాల నివేదికను రూపొందించాలని సర్కారు నిర్ణయించింది.

బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ప్రభుత్వ భూముల వేలం ద్వారా సుమారు 14 వేల కోట్ల వరకు సమకూర్చుకున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌ఎం‌డీఏ పరిధిలోని కోకాపేటలో 49 ఎకరాలను వేలం ద్వారా విక్రయించగా రూ. 2000 కోట్లు సమకూరాయి. ఇదే తరహాలో అందుబాటులోని భూములను వేలం ద్వారా విక్రయించి సంక్షేమ పథకాల అమలుకు ఖర్చు చేయాలనే యోచనలో రేవంత్‌ ‌సర్కారు ఉంది. కోకాపేట సమీపంలోని నియోపొలిస్‌లో వేలం ద్వారా ఒక్కో ఎకరం రూ. 59- 100 కోట్లు పలికాయి. ఇంకా అక్కడ విలువైన భూమి కొంత ఉంది. చుట్టూ భారీ ఆవాసాలు, ఆకాశహర్మ్యాలు, ఐటీ టవర్లు ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న వాణిజ్య భూమికి మంచి ధర వస్తుందని సర్కారు అంచనా వేస్తోంది. ఇటు బుద్వేల్‌లో కూడా గత ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది నెలల ముందే కొన్ని భూములను వేలం వేసింది. ఎకరా 20-30 కోట్ల వరకు పలికింది. అక్కడ కూడా ఇంకా ఖరీదైన ప్రభుత్వ భూములున్నాయి.

ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ముందు జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న భూముల వివరాలను సేకరిస్తోంది. అత్యంత ప్రాధాన్య కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ ‌ముగిశాక విడతల వారీగా భూముల వేలం పక్రియను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఎం‌డీఏతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై సమగ్ర నివేదిక రూపొం దించాలని, కోర్టు వివాదాల్లో లేని భూములను వేలం వేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

-సుజాత గోపగోని

About Author

By editor

Twitter
YOUTUBE