– క్రాంతి

ఈశాన్య భారతంలోని మణిపూర్‌ ‌రెండు నెలలుగా అక్షరాల మండిపోతున్నది. హింసాత్మకంగా మారి అట్టుడికిపోతున్నది. ఇప్పటివరకూ సుమారు 142 మంది ప్రాణాలు కోల్పోగా, 45,000 మంది సహాయ శిబిరాలకు తరలిపోవలసి వచ్చిందంటేనే దాని తీవ్రతను అంచనా వేయవచ్చు. ఇది ప్రధానంగా మెయితీలకు, కుకీలకు మధ్య జరుగుతున్న ఘర్షణ. దీనిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడంలేదు. ఈ అల్లర్లు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వవలసిన స్థాయికి వెళ్లాయి. సైన్యం సహాయం కూడా తీసుకోవలసి వచ్చింది. మెయితీలకు షెడ్యూల్డ్ ‌తెగ హోదా ఇవ్వాలనే అంశం తెరపైకి రావడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని కొందరు విశ్లేషకులు చెబుతున్నా, ఈ ఘర్షణల మూలాలు దశాబ్దాల నాటివి. తాజా ఘర్షణ మాత్రం కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీని ఇబ్బంది పెట్టడానికే.


ఈ సంవత్సరం మార్చి 10 తరువాత మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. బీరేన్‌సింగ్‌ ‌ముఖ్యమంత్రి. చిత్రంగా ఏప్రిల్‌ 27 ‌నుంచి అక్కడ హింసాకాండ మొదలయింది. ఇది నేటికీ చల్లారలేదు. దీనిని బట్టి మణిపూర్‌ ‌మంటల రంగును అంచనా వేయవచ్చు. అయితే ఇది చిదంబర రహస్యం. బయటకు చెప్పడానికి మేధావులు అంగీకరించరు. ఇదంతా కొండలో నివసించే కుకీలకీ, ఇంఫాల్‌ ‌లోయ కేంద్రంగా నివసించే మెయితీలకీ మధ్య ఘర్షణ. కుకీలు ప్రధానంగా క్రైస్తవులు. మెయితీలు హిందువులు. వీరినే మణిపురీలు అంటారు. వీరంతా ప్రధానంగా గౌడీయ వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తారు. కొండప్రాంతాలలో ఒకనాడు నివసించిన ఈ సంప్రదాయం వారిని అక్కడ నుంచి తరిమేశారు. వారంతా అస్సాం బరాక్‌ ‌లోయకు వెళ్లి స్థిరపడ్డారు. ఎప్పుడూ ఈశాన్య భారత వ్యవహారాల పట్ల మనం ఉదాసీనంగా ఉన్నట్టే ఈ విషయంలోనూ ఉన్నాం. అందుకే ఇందులోని గుట్టుమట్లు వెలికి రావడం లేదు. మయన్మార్‌-‌భారత్‌ ‌సరిహద్దు పట్టణం మోరేలో నివాసం ఉంటున్న తమిళ హిందువుల ఇళ్లను ఉగ్రవాద క్రైస్తవ ముఠాలు తగులబెట్టాయి. ఈ కాస్త చరిత్ర, ఈ కొన్ని ప్రస్తుత పరిణామాలు గమనించినా ఇందులో హిందూ క్రైస్తవ కోణం దాచేయడం వాస్తవికత అనిపించుకోలేదు. అయితే దీనికి తోడు గిరిజన తెగల మధ్య ఉన్న భూవివాదాలు కూడా తోడయ్యాయని అంగీకరించవలసి ఉంటుంది. కాబట్టి మెయితీలకు ఎస్‌టీ హోదా ఇచ్చే అంశం పరిశీలించవచ్చునని హైకోర్టు ఇచ్చిన తీర్పు హింసా కాండను, పాత ఘర్షణలను కొనసాగించడానికి కేవలం ఒక సాకు. ఇదే కాకుండా ఈశాన్య భారతంలోని ప్రతి గిరిజన తెగ ఎదుటి తెగను విశ్వసించదు. అక్కడి తెగల మధ్య ఘర్షణకు బయటి శక్తుల జోక్యం ప్రధాన కారణం.

నిజానికి క్రైస్తవులు ఎస్‌టీలు ఎందుకు అవుతారు? ఇప్పుడు దేశంలో వినవస్తున్న ప్రశ్న ఇది. ఇదే ఈశాన్య భారత క్రైస్తవులకు వర్తిస్తుంది. ఒకవేళ పేదరికమే ఎస్‌టీ హోదాకు ప్రమాణమైతే కొండ ప్రాంతాల వారికంటే మొయితీలోనే పేదలు ఎక్కువ. నిజానికి మణిపూర్‌ ‌హింసాకాండ చరిత్రను పరిశీలిస్తే కుకీలదే ఎక్కువ పాత్ర కనిపిస్తుంది. 1990లో జరిగిన కుకీ-నాగా ఘర్షణలలో అప్పటిదాకా మోరేలో అధిక సంఖ్యాకులుగా ఉన్న నాగాలను తరి మేసి కుకీలు ఆధిపత్యం సాధించారు. దీని ఫలితంగా అక్కడ నివసిస్తున్న తమిళ హిందువులు బలై పోయారు. ఇప్పుడూ అదే జరిగింది. కుకీల హిందూ వ్యతిరేకత ఇక్కడే కాదు, తిప్రురలోని జంపుయి కొండలలో కూడా కనిపిస్తుంది. అక్కడ ఉన్న బెహింగ్‌ ‌శివ్‌ ఆలయాన్ని క్రైస్తవ మిజోలతో కలసి కుకీలు 1997లో కూల్చారు. ఈ ఆలయానికి సాంస్కృతి కంగా చాలా చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని కూల్చడ మంటే హిందూ జీవన జాడలు నిర్మూలించే ఉద్దేశమేనన్న అభిప్రాయం వచ్చింది. పైగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి తరువాత విశ్వ హిందూ పరిషత్‌, ‌బజ్రంగ్‌ ‌దళ్‌ ‌చేసిన ప్రయత్నాలను క్రైస్తవ మిషనరీలు సాగనివ్వలేదు. ఆ విధంగా ఈశాన్య భారతంలోని వేర్పాటువాద శక్తులకూ, మిషనరీలకూ ఉన్న చీకటిబంధం తెలుసుకోవచ్చు. పైగా 1901 నుంచి 2022 వరకు వరిశీలిస్తే కుకీల జనాభాలో పెరుగుదల మెయితీ, నాగా జనాభాలో తరుగుదల కనిపిస్తుంది.

 నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టింది. అక్కడి తెగల మధ్య చిరకాలంగా ఉన్న ఘర్షణలకు పరిష్కారాలు వెతకడం ఇందులో భాగమే. ఇవి చాలావరకూ ఫలించాయి. ఇక్కడి రాష్ట్రాల ప్రజలు పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనీ, ఆ పార్టీ ఉన్న సంకీర్ణ కూటమినీ బలపరచడం గమనించవచ్చు. ఈ ప్రయత్నాలు కొన్ని శక్తులకు నచ్చడం లేదు.

అపనమ్మకంతోనే దాడులు

ప్రస్తుత సంక్షోభం అక్కడి తెగల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాలను మరోసారి పట్టి చూపుతోంది. రాజధాని ఇంఫాల్‌ ‌లోయలో ఉండే మెయితీలకు, కొండల్లో ఉండే కుకీలు, నాగాలకు మధ్య ఘర్షణలు కొత్తగా వచ్చినవి కావు. మణిపూర్‌ ‌రాష్ట్రంలో 80 శాతానికి పైగా పర్వత ప్రాంతమే ఉంటుంది. ఇక్కడ నివసించే జనం 20 శాతంలోపే. వీరికి షెడ్యూల్డ్ ‌తెగల హోదా ఉంది. వీరికి పర్వత ప్రాంతాలతో పాటు లోయలోని భూమిపై కూడా హక్కు ఉంది. కానీ జనాభాపరంగా 80 శాతం ఉన్న మెయితీలు 20 శాతం భూభాగానికే పరిమిత మయ్యారు. తమకు గతంలో ఉన్న షెడ్యూల్డ్ ‌తెగల హోదాను పునరుద్ధరిస్తే పర్వత ప్రాంతాల్లో కూడా నివాసం ఏర్పరచుకోవచ్చని భావిస్తున్నారు.

మెయితీలకు షెడ్యూల్డ్ ‌తెగల హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని మణిపూర్‌ ‌హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల తర్వాత దీన్ని బలంగా వ్యతిరేకిస్తున్న కుకీలు ఆందోళనలకు దిగారు. మెయితీలపై, వారి ఆస్తులపై దాడులు చేపట్టారు. ప్రతిగా మెయితీలు ఎదురుదాడికి దిగారు. ఈ ఘర్షణల్లో ఇళ్లు వ్యాపారాలతో పాటు ప్రార్థనాలయాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇందులో చర్చ్‌లతో పాటు దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇంఫాల్‌కి చెందిన కేంద్ర మంత్రి ఇంటిని కూడా అల్లరిమూకలు వదిలిపెట్టలేదు. మణిపూర్‌ ‌హింసకు సంబంధించి దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌పీఎస్‌ ‌నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆ హింసపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. హింసను మరింత పెంచేం దుకు తమను వాడుకోవద్దని ధర్మాసనం కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలు అవసరమైతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఇంఫాల్‌ ఈస్ట్, ఇం‌ఫాల్‌ ‌వెస్ట్ ‌జిల్లాల్లోనే హింస అధికంగా జరిగిందని, ఈ ప్రాంతాల్లోనే 5 వేలకు పైగా ఘర్షణలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మరణాలు కూడా ఈ జిల్లాల్లోనే అధికంగా చోటు చేసుకోవడంతో, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి, శాంతి భద్రతలను కాపాడినట్లు తెలిపింది. 124 పారామిలటరీ బలగాలు, 184 సైనిక బలగాలను రంగంలోకి దించినట్లు చెప్పింది.

ఫలించని శాంతి ప్రయత్నాలు

అల్లర్ల్లు మొదలైన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇంఫాల్‌ ‌వెళ్లారు. వివిధ తెగల నాయకు లతో చర్చించి, శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు ప్రయత్నించారు. సమస్య పరిష్కారం కోసం గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ ‌లాంబా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేశారు. సంక్షోభానికి కారణా లను కనుక్కోవడం, ఎవరి బాధ్యత ఏమిటో తేల్చడం ఈ కమిటీ ఉద్దేశం. కానీ రాష్ట్ర గవర్నర్‌ అనసూయ ఉయుకీ నేతృత్వంలో 51 మందితో ఒక శాంతి సంఘం ఏర్పాటు చేసే ప్రయత్నానికి అవరోధాలు ఏర్పడ్డాయి. కమిటీ కోసం ఎంపిక చేసిన సభ్యులు క్రమంగా వెనక్కి తగ్గుతున్నారు. రాజకీయ ప్రమేయం ఉన్నవారు ఎక్కువవుతున్నందుకే తప్పుకున్నామని వారు చెబుతున్నారు. కమిటీలోని కుకీ సభ్యులు ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ ‌చేరికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కన్నా బీరేన్‌ ‌సింగ్‌ను పదవి నుంచి తప్పించాలనే ఆచరణ సాధ్యం కాని డిమాండ్‌ను వారు చేశారు.

తటస్థంగా ఉన్న నాగాలు

మెయితీల్లో అధికశాతం తమకూ షెడ్యూల్డ్ ‌తెగల గుర్తింపును కాంక్షిస్తున్నారు. కుకీలతో పాటు నాగాలూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మెయితీలకు వ్యతిరేకంగా కుకీలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా నాగాలు సంయమనంతో ఉన్నారు. ముఖ్యంగా మే 3న నిర్వహించిన ర్యాలీలో నాగాలు హద్దు మీరలేదు. కుకీలు మాత్రం చురాచంద్రపూర్‌ ‌జిల్లాలో మెయితీ లున్న ప్రాంతాలపై దాడులు చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. కుకీల ఒక యుద్ధస్మారక చిహ్నాన్ని మెయితీలు తగలబెట్టేశారన్న వదంతులతో ఈ విధ్వంసం జరిగింది. మెయితీలపై కలిసి యుద్ధం చేద్దామని కుకీలు పిలుపునిచ్చినా, నాగాలు ప్రస్తుతా నికి తటస్థంగానే ఉన్నారు. జూన్‌ 9‌న రాష్ట్రానికి చెందిన పదిమంది నాగా ఎమ్మెల్యేలు సంప్రదింపుల కోసం అమిత్‌ ‌షాను కలిశారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తమ వంతు సాయం అందిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే కుకీల కోసం ప్రత్యేక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయా లన్న ప్రతిపాదనను వారు తీసుకురావడం గమ నార్హం. దీనికోసం నాగాల భూముల జోలికి మాత్రం రావద్దని వీరు కోరారు.

మణిపూర్‌లోని పర్వతప్రాంత జిల్లాల్లో కుకీ గ్రామాలు విస్తరించి ఉన్నాయి. నాగాలు కూడా చురాచంద్రపూర్‌ ‌మినహా మిగిలిన పర్వతప్రాంత జిల్లాలను తమ మూల నివాసంగా భావిస్తారు. యునైటెడ్‌ ‌నాగా కౌన్సిల్‌ 1990‌లో కుకీ గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. నాగాల దృష్టిలో కుకీలు తమ గ్రామాల్లో ఉంటున్న కిరాయిదారులు. అప్పుడు ఇరు తెగలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 800 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం నాగాల వైఖరితో కుకీలు గుర్రుగా ఉన్నారు. అయితే, కుకీలతో కలిసిరాకున్నా, మెయితీలతో నాగాలకు భేదాభిప్రాయాలు లేవని భావించడానికి వీలులేదు.

దెబ్బతిన్న సమతౌల్యం

మణిపూర్‌ ‌చిన్న రాష్ట్రం అయినా 33 తెగలు, 190 భాషలను చూడవచ్చు. అయితే అధికారిక భాషగా మెయితీనే ఉపయోగిస్తారు. ఇక్కడి తెగలన్నీ రాష్ట్రం పేరుకు తగ్గట్లే మణిహారంగా కలిసి మెలిసి జీవిస్తూ వచ్చారు. అనేక సంస్కృతుల సమాహారం అయినా ఆహారం, జీవన శైలి దాదాపు ఒకటే. కొన్ని దశాబ్దాలుగా తెగల మధ్య పోరాటాలు జరుగుతు న్నాయి. కొన్ని వేర్పాటువాద శక్తులు ఈ దూరాన్ని పెంచుతూ వచ్చాయి. మణిపూర్‌కు కాంగ్లీపాక్‌ అనే పేరు కూడా ఉంది. ఈ పేరును వీరు ప్రధానంగా ఉపయోగిస్తుంటారు.

మణిపూర్‌లో 1961నాటికి హిందూ జనాభా 62 శాతం కాగా, ప్రస్తుతం 41 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో క్రైస్తవ జనాభా 19 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బ్రిటిష్‌ ‌వారి కాలం నుంచి అంతర్జాతీయంగా సాగించిన ప్రయత్నాలు ఇక్కడి సమతౌల్యాన్ని దెబ్బతీస్తూ వచ్చాయి.

మణిపూర్‌ ‌జనాభాలో ప్రధాన తెగ అయిన మెయితీలు 53 శాతం వరకూ ఉంటారు. నాగాలు 24 శాతం ఉంటే, కుకీ/జో (చిన్‌ ‌కుకీ మిజో)లు 16 శాతం ఉంటారు. వీరు కాకుండా తంగ్‌ఖుల్‌, ‌కబుయి, పైట్‌, ‌హ్మార్‌, ‌కచా నాగా, వైఫుయ్‌, ఐమోల్‌, అనల్‌, ‌చిరు, ఛోతే, గాంగ్టే, ఇన్‌పుయ్‌, ‌హ్మార్‌, ‌ఖరం, ఖోయిబు, కోయిరావ్‌, ‌కోమ్‌, ‌లామ్‌కాంగ్‌, ‌లియాంగ్‌మై, మావో, మారాం, మారింగ్‌, ‌మేట్‌, ‌మోన్‌సాంగ్‌, ‌మోయోన్‌ ‌వంటి గుర్తింపు పొందిన తెగలు ఉన్నాయి. పైటే, పౌమై, పురుమ్‌, ‌రాల్టే, రోంగ్‌మీ (కబుయి), సిమ్టే, సుహ్తే, తంగ్‌ఖుల్‌, ‌తారావో, థాడౌ, తంగల్‌, ‌వైఫే, జెమ్‌, ‌జౌ తెగలు కూడా ఉన్నాయి. ఇంకా నేపాలీలు, బెంగాలీలు, తమిళులే కాక మార్వాడీలు గణనీయమైన సంఖ్యలో నివసిస్తున్నారు. మణిపూర్‌లో మెయితీలు, నాగాలు మాత్రమే మూలవాసులు అన్న వాదన గమనార్హం. తర్వాత కాలంలో కుకీలు ఈ రాష్ట్రంలోకి చొరబడుతూ వచ్చారు. ముఖ్యంగా పొరుగున ఉన్న మయన్మార్‌ ‌నుంచి అత్యధికంగా రాష్ట్రంలోకి ప్రవేశించారు. ఇప్పటికీ చొరబాట్లు కొనసాగు తున్నాయి.

వేర్పాటువాద చరిత్ర

మణిపూర్‌తో తెగల మధ్య హింసకు, వేర్పాటు వాద శక్తులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మణిపూర్‌ ‌సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ 1964లో య •నైటెడ్‌ ‌నేషనల్‌ ‌లిబరేషన్‌ ‌ఫ్రంట్‌ (‌యుఎన్‌ఎల్‌ఎఫ్‌) ఏర్పడింది. ఇదే మొదటి తిరుగుబాటు ముఠా. భారత్‌ ‌నుంచి మణిపూర్‌ను వేరు చేసి ప్రత్యేక దేశంగా ఏర్పరచాలన్నది దీని లక్ష్యం. పీపుల్స్ ‌రివల్యూషనరీ పార్టీ ఆఫ్‌ ‌కాంగ్లీపాక్‌ (‌పీఆర్‌ఈపీఏకే) 1977లో ఏర్పడగా, పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)‌ని 1978లో స్థాపించారు. ఈ సంస్థకు చైనా నుంచి ఆయుధాలు అందడంతో పాటు, శిక్షణ ఇచ్చారని నిఘా వర్గాలు గుర్తించాయి. కాంగ్లీపాక్‌ ‌కమ్యూనిస్ట్ ‌పార్టీ(కెసిపి) 1980లో ఏర్పడింది.

ఈ సంస్థలు చీలికలు పేలికలుగా మారి, మరి కొన్ని కొత్తవి పుట్టుకొచ్చాయి. అవే- రివల్యూషనరీ పీపుల్స్ ‌ఫ్రంట్‌ (ఆర్‌పీఎఫ్‌), ‌మణిపూర్‌ ‌లిబరేషన్‌ ‌ఫ్రంట్‌ ఆర్మీ (ఎఎల్‌ఎఫ్‌ఏ ), ‌కాంగ్లీ యావోల్‌ ‌కాన్బలుప్‌ (‌కేవైకేఎల్‌), ‌రివల్యూషనరీ జాయింట్‌ ‌కమిటీ (ఆర్‌కేసీ), కాంగ్లీపాక్‌ ‌కమ్యూనిస్ట్ ‌పార్టీ (కేసీపి), పీపుల్స్ ‌యునైటెడ్‌ ‌లిబరేషన్‌ ‌ఫ్రంట్‌ (‌పీయూఎల్‌ఎఫ్‌), ‌మణిపూర్‌ ‌నాగా పీపుల్‌ ‌ఫ్రంట్‌ (ఎంఎన్‌పీఫ్‌), ‌నేషనల్‌ ‌సోషలిస్ట్ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌-‌కే), నేషనల్‌ ‌సోషలిస్ట్ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌-ఐ/ఎం), ‌యునైటెడ్‌ ‌కుకీ లిబరేషన్‌ ‌ఫ్రంట్‌ (‌యూకేఎల్‌ఎఫ్‌), ‌కుకీ నేషనల్‌ ‌ఫ్రంట్‌ (‌కేఎన్‌ఎఫ్‌), ‌కుకీ నేషనల్‌ ఆర్మీ (కేఎన్‌ఏ), ‌కుకీ డిఫెన్స్ ‌ఫోర్స్ (‌కేడీఎఫ్‌), ‌కుకీ డెమోక్రటిక్‌ ‌మూవ్‌మెంట్‌ (‌కేడీఎం), కుకీ నేషనల్‌ ఆర్గనైజేషన్‌ (‌కేఎన్‌ఓ), ‌కుకీ సెక్యూరిటీ ఫోర్స్ (‌కేఎస్‌ఎఫ్‌), ‌చిన్‌ ‌కుకి రివల్యూషనరీ ఫ్రంట్‌ (‌సీకేఆర్‌ఎఫ్‌), ‌కోమ్‌ ‌రెమ్‌ ‌పీపుల్స్ ‌కన్వెన్షన్‌ (‌కేఆర్‌పీసీ), జోమీ రివల్యూషనరీ వాలంటీర్స్ (‌జడ్‌ఆర్‌వీ) ఉన్నాయి. ఈ తిరుగుబాటు గ్రూపుల్లో కొన్ని స్వాతంత్య్రం కోరుతుంటే, కొన్ని తమ తెగలకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నాయి. నాగాలు మణిపూర్‌లో కొంత భాగం విడదీసి నాగాలాండ్‌తో కలపాలంటున్నారు. లేదా నాగాలిమ్‌ ‌పేరుతో మరో రాష్ట్రం ఇవ్వాలంటున్నారు.

మణిపూర్‌లోని ఈ తిరుగుబాటు మూకలు బ్యాంకు దోపిడీలతో పాటు, పోలీసులపై, ప్రభుత్వ భవనాలు, ఆస్తులపై ఎన్నో దాడులు జరిపాయి. తెగల మధ్య ఏర్పడ్డ ఘర్షణల్లో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని తెగలవారు పొరుగు రాష్ట్రాలకు పారిపోయారు. కుకీల దాడుల కారణంగా రియాంగ్‌-‌చక్మాలు రెండు తరాల కింద త్రిపురకు పారిపోయి అక్కడి శరణార్థ శిబిరాల్లో గడుపు తున్నారు.

పాక్షింగానే ఫలించిన ప్రయత్నాలు

మణిపూర్‌లో వేర్పాటువాద శక్తుల హింసను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) అమలు చేసింది. ఈ చట్టానికి ఉన్న అపరిమిత అధికారాల కారణంగా హింసాత్మక కార్యకలాపాలు తగ్గాయి. అయితే ఏఎఫ్‌ఎస్‌పీఏ ఎత్త్తివేయాలంటూ కొన్ని సంస్థలు, వ్యక్తులు పోరాటాలు సాగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇరోమ్‌ ‌షర్మిలా చాను ఏళ్ల తరబడి సాగించిన నిరాహార దీక్ష ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని ఆమె దీక్షను విరమించక తప్పలేదు. ఇంత చేసినా ఆమె ఎన్నికల్లో నిలబడితే ఘోరంగా ఓడిపోయింది. అంటే, అక్కడి ప్రజలు ఇరోమ్‌ ‌పోరాటాన్ని గుర్తించ లేదని అర్థంచేసుకోవాలా?

మణిపూర్‌లో శాంతిని నెకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. 2005లో కుకీ నేషనల్‌ ఆర్గనైజేషన్‌ (‌కేఎన్‌ఓ) ‌భారత సైన్యంతో కలిసి సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్ (ఎస్‌ఓఓ)‌పై సంతకం చేసింది. తర్వాత 2008లో కేఎన్‌ఓకు కేంద్ర, రాష్ట్రాలతో కలిపి త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాలేవీ నిలవడం లేదు. వేర్పాటువాద శక్తులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

ముఖ్యంగా మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత అక్కడి నుంచి వేలాది మంది కుకీ-చిన్‌ ‌శరణార్థులు మణిపూర్‌లోకి ప్రవేశించారు. వీరికి స్థానిక కుకీలు అండగా నిలిచారు. వీరంతా అటవీ ప్రాంతాలను ఆక్రమించి, గంజాయి సాగు చేయడం ఆందోళనలకు దారి తీసింది. వీరికి వేర్పాటువాద గ్రూపులు అండ ఉంది. ఆక్రమణదారులను అడ్డుకు నేందుకు మణిపూర్‌ ‌సీఎం బీరేన్‌ ‌సింగ్‌ ‌చేసిన ప్రయ త్నాలను వీరు వ్యతిరేస్తున్నారు. తాజాగా మొయితీ లకు ఎస్సీ హోదా కల్పించే అంశం తెర మీదకు రావడంతో వేర్పాటువాద శక్తులు రెచ్చి పోయేందుకు అవకాశం ఏర్పడింది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE