-డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

డిసెంబర్‌ 16 ‌ధనుర్మాసారంభం

సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన నాటి నుంచి నెలరోజుల కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఆహ్లాదం, ఆనందం కలిగించేవి తానేనని శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పుకున్న సందర్భంలో ‘మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః’ (భగవద్గీత :10-35) అన్నారు. మార్గశీర్షం ధనుర్మాసం కావడం వల్ల భగవత్సంబంధిత పూజాపునస్కారాలు నిర్వహించడం విదితమే. పంటలు చేతికి వచ్చే ఆనంద దాయక సమయం. ఇంటింటా గొబ్బెమ్మలు పెట్టడం, హరిదాసుల నగర సంకీర్త నలు, గంగిరెద్దుల ఆటలు లాంటివి తెలిసినవే. మార్గశిర ఏకాదశి నాడే భగవానుడు అర్జునుడికి ‘గీత’ బోధించాడు. సమశీతోష్ణిస్థితి నెలకొంటుంది కనుక ఈ మాసం ప్రాణులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. లోక శ్రేయస్సుతో పాటు స్వకల్యాణాన్ని అపేక్షించిన గోదాదేవి తమ ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకునేందుకు ధనుర్మాస వ్రతం పాటించి రోజుకొకటి చొప్పున మాసం పాటు ముప్పయ్‌ ‌కీర్తనలు (తమిళంలో పాశురాలు) ఆలపించడం మరో ప్రత్యేకత.


విష్ణుదేవుడే మాస రూపమైన అపురూప సందర్భం ధనుర్మాసం. శ్రీమన్నారాయణుడి ఆరాధనకు అనువైన కాలంగా ప్రసిద్ధి. ఈ మాసంలో విష్ణ్వారాధన చేస్తే వెయ్యేళ్లపాటు చేసే శుభకర్మల ఫలితం లభిస్తుందని బ్రహ్మాండ, స్కంద, ఆదిత్య పురాణాలు పేర్కొంటున్నాయి. దీనికి పరిపూర్ణత్వం కలిగించేదే తిరుప్పావై. ధనుర్మాసం లేదా శ్రీవతంగా ఈ మాసంలో మొదలవుతుంది.

మార్గశీర్షం… ‘మార్గం’ అంటే దారి. శిరము అంటే తల. మానవ శరీరానికి తల దిశానిర్దేశం చేసినట్లే మార్గశీర్ష మాసం ఆధ్యాత్మికతవైపునకు దారి చూపుతుందని చెబుతారు. ధనుర్మాసం విశిష్టతను బ్రహ్మ మొదట నారదుడికి వివరించినట్లు పురాణ కథనం. బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలలోనూ, నారాయణ సంహితలో ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. బాల్యం నుంచి భక్తి, జ్ఞానాది సుగుణాలు కలిగిన గోదాదేవి తనను భగవంతునికి అర్పించుకునేందుకు ‘కాత్యాయని వ్రతం’ అనే ధనుర్మాస వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించింది.

భారతీయ భక్తి సాహిత్యంలో ఆళ్వార్‌ ‌దివ్య ప్రబంధాలు అత్యంత ప్రముఖ స్ధానాన్ని అలంక రించగా, శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ శ్రీఆండాళ్‌ ‌గానం చేసిన ముప్పయ్‌ ‌కీర్తనల (పాశురాలు) సంపుటి ‘తిరుప్పావై’ దివ్యప్రబంధంగా శిఖరాయమానంగా వెలుగొందుతోంది. తిరుప్పావై ఉపనిషత్తుల సారమని, అవి గోదాదేవి నోట సర్వ సులభరీతిలో పాశురాలుగా వెలువడ్డాయని పూర్వాచార్యులు అభివర్ణించారు.

విష్ణుచిత్తుడి (పెరియాళ్వార్‌) ‌కుమార్తె గోదాదేవి భగవంతుడినే పరిణయమాడాలన్న సంకల్పంతో పాటు సమాజహితం కోసం దీక్ష బూనింది. ఆ క్రమంలోనే ధనుర్మాసంలో వేకువనే మేల్కొని స్నేహితురాళ్లతో కలసి హరి పూజ చేస్తూ, ఆ అనుభవాలను రోజుకు ఒక కీర్తన (పాశురం)గా రాసి శ్రీకృష్ణ అంశ శ్రీరంగనాథుడికి అర్పించింది. ‘తిరుప్పావై’ అనే ఈ తమిళ పదానికి ‘తిరు’ అంటే శ్రీ, శ్రీప్రదం, లక్ష్మి, సంపద, శ్రేష్ఠం, ఐశ్వర్యం, మోక్షం అనే అర్థాలు ఉన్నాయి. ‘పావై’ అంటే పాట(లు) లేక వ్రతమని అర్థం. దీనినే శ్రీ వ్రతం, ధనుర్మాస వ్రతం, సిరినోము అనీ అంటారు.

 సమాజానికి హితం కలిగించేదే సాహిత్యమనే ఆలం కారికులు అభిప్రాయం ప్రకారం, గోదాదేవి ఆలపించిన పాశురాలలో సమాజశ్రేయస్సు కనిపిస్తుంది. శ్రీరంగనాథుని పరిణయమాడాలన్న అభిమతంతో పాటు సాహిత్యం ద్వారా సమాజ హితాన్ని కోరిన సౌజన్యమూర్తిగా ఆమె సాక్షాత్క రిస్తారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలే కాకుండా స•మష్టి లబ్ధి చేకూరాలన్న భావన ఇందులో వ్యక్తమవు తుంది. ‘ఏడాదికి మూడు పంటలు పండాలి. చాలినంత వర్షం కురవాలి. గోవులు సమృద్ధిగా పాలు ఇవ్వాలి. ఏ సందర్భంలోనూ ‘లేదు’ అనే మాట వినిపించకూడదు’ అని ఒక పాశురంలో ఆకాంక్షించడం గోదా లోక క•ల్యాణాభి లాషకు ఉదాహరణ. మంచి అలవాట్లతో జీవించాలని, తోటి వారికి సాయపడాలని, భగవంతుడిని ఆరాధించాలని ఈ పాశురాలు ప్రబోధిస్తాయి. వీటిలో పరమాత్ముని తీరు, ఆయనను చేరేందుకు అనుసరించవలసిన మార్గాలు, పల్లెల అందాలు, ఉదయం కాలపు వర్ణనలు ఉంటాయి.

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ముకుందా చార్యులు, పద్మావతి దంపతులకు జన్మించిన భట్టనాథుడు (విష్ణు చిత్తుడు) తన జీవితాన్ని భగవత్‌ ‌సేవకు అంకితం చేశారు. వటపత్రసాయికి నిత్యం తులసి, పూమాలలను సమర్పిస్తూ, తాను రాసిన పన్నెండు కీర్తనలు (తిరుపల్లాణ్డు) గానం చేస్తూ మంగళం పాడేవాడు.

‘కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీకాననోద్భవామ్‌

‌పాండ్యే విశ్వంభరాంగోదాం వందేశ్రీరంగ నాయకీమ్‌’

‌రంగనాథ పెరుమాళ్‌ ‌పుష్పకైంకర్యం కోసం ఆయన పెంచుతున్న పూలు, తులసి•వనంలో కర్కాటక మాసం, పుబ్బ నక్షత్రంలో చిన్నారి లభించింది. ఆనంతపరవశుడైన ఆయన పూలమాల అని అర్థం వచ్చేలా చిన్నారికి ‘కోదె’ అని పేరుపెట్టారు. ఆ పదమే ‘గోదా’ అని సంస్కృతీక మైంది. భూమిని ‘గో’ అంటారు. ఆండాళ్‌ ‌భూదేవి అంశ కనుక, ‘గోదా’ అనే పేరు కలిగిందని వ్యవహారంలో ఉంది. జానకీమాతలా భూజాత అయిన ఆమెను విష్ణుచిత్తులు ‘ఆండాళ్‌’ (‌కాపాడునది) అని సంబోధించారు. ‘తనను తరింపచేసేందుకు ఆమె తన కుమార్తెగా లభించిందని ఆయన భావన.

పాలక జనకుడు విష్ణుచిత్తుడు శ్రీకృష్ణ వైభవాన్ని వినిపిస్తుంటే చిన్నారి తనయ గోదాదేవి మైమరచి ఆలకించేది. శ్రీకృష్ణుడి బాల్యంలోని గోపికలలో తాను ఒకరిగా, ఉద్యానవనంలోని తండ్రి కుటీరాన్నే యదునంద నుడి రాజ్యంగా భావించుకునేది. ద్వాపరంలో యాదవ కన్యలు జరిపిన ఉత్సవాలను మానసికంగా తనకు అన్వయించుకుంటూ, ఆ అనుభూతికి అక్షరరూపం ఇచ్చింది. అలా కృష్ణునిపై గల భక్తి ప్రేమగా మారి ఆయనను పతిగా ఊహించుకుంటూ, ఆయన కరుణ కోసం పూజలు (కాత్యాయనీ వ్రతం) ఆచరించింది. ‘పరమాత్ముని పట్ల గల అనన్యభక్తి అమృత స్వరూపం’ అంటాడు దేవరుషి నారదుడు. లోకంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమ లౌకికం కాగా, భగవంతుడికి భక్తుడికి మధ్య గల ప్రేమ అలౌకికం. అదే మధురభక్తి. ఆ మార్గంలో భగవంతుడిని సేవించి తరించిన వనిత, దివ్యాంశ సంజాత• గోదాదేవి.

స్వామి సేవకోసం పెరియాళ్వారు తయారు చేసిన పూలమాలలను ముందుగా ఆమె ధరించి బావిలోని నీటిలో (బావి శ్రీవిల్లిపుత్తూరులో నేటికీ ఉంది) ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయేదట. ఆ సంగతి తెలియని పెరియాళ్వార్‌ ఆమె ‘ధరించి విడిచిన మాలలనే స్వామివారికి సమర్పించేవారు. ఒకరోజు దండలో కనిపించిన శిరోజం కూతురిదిగా గ్రహించి, స్వామి పట్ల తన అపచారానికి కలత చెంది ఆరోజు ఆయానికి మాలలు పంపలేదు. అదే రోజు రాత్రి విష్ణుచిత్తుడికి కలలో కనిపించిన శ్రీరంగనాథుడు ‘గోదా ధరించిన దండలే నాకు ఇష్టం. ఆమెను పరిణయ మాడతాను. నా వద్దకు చేర్చు’ అని సూచించి, పాండ్యరాజుకు స్వప్న సాక్షాత్కారం చేసి ‘ఆండాళ్‌ ‌కోసం పల్లకీ పంపవలసిందిగా ఆదేశించాడు. గోదా స్వామి కోసమే అవతరించిన కారణజన్మురాలిగా భావించారు విష్ణుచిత్తులు. స్వామి కబురుతో ఆనందోత్సాహాలతో ఆలయం చేరుకున్న ఆండాళ్‌ ‌పరిణయమాడి ఆయనలో ఐక్యమైంది. దీక్ష, పట్టుదల, నియమం, అనుష్ఠానం, ఉపవాసం, పారాయణం, పూజాది ధార్మిక కార్యకలాపమే వ్రతమని పెద్దలు నిర్వచించారు. శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధితో చేసే వ్రతం చక్కని ఫలితాన్నిస్తుందనేందుకు గోదామాత అనుభవం భక్తకోటికి చాటిచెబుతోంది.

‘రంగనాయకి’కి శూడికొడుత్త నాచ్చియార్‌, ఆముక్తమాల్యద అనే పేర్లు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. స్వామి కోసం తయారైన పూలమాలలు ఆమె ధరించిన తర్వాతే స్వామికి చేరేవి కాబట్టి ఆమెకు ‘శూడి కొడుత్త నాచ్చియార్‌’ (‌సంస్కృతీకరణ రూపం ‘ఆముక్తమాల్యద) అని వ్యవహారంలోకి వచ్చింది. రామానుజాచార్యుల శిష్యులు అనంతా చార్యులు ఆమెను మొదటిసారిగా ‘ఆముక్తమాల్యద’ అని వ్యవహరించినట్లు ఆయన కావ్యం ‘ప్రసన్నా మృతం’ పేర్కొంటోంది. అనంతర కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు ఆ పేరునే యథాతథ•ంగా స్వీకరించి కావ్యరచన చేశారు.

తిరుప్పావై.. విధివిధానాలు

తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు నిర్దేశితమయ్యాయి. వేకువజామునే నిద్రలేచి స్నానాదులు ముగించుకుని పాశురాలను, స్వామి కీర్తనలను ఆలపించాలి. దేవదేవేరులకు ఇష్టమైన పుష్పాలు సమర్పించాలి. పొంగలిని నివేదించాలి. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడిగా అర్చించి, మొదటి పక్షం రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నివేదిస్తారు. తరువాతి పక్షం పాటు దధ్యోజనం సమర్పిస్తారు. పెళ్లీడు యువతులు ఇళ్ల ముందు గొబ్బిళ్లు పెట్టి పూలు చేయడం వల్ల కోరిన వారు భర్తలుగా లభిస్తారని విశ్వాసం.

ఆళ్వారుగా…

ఆధ్యాత్మిక సాగరంలో మునిగి తేలిన వారిని శ్రీవైష్ణవ సంప్రదాయంలో ‘ఆళ్వారులు’ అంటారు. అలాంటి పన్నెండు మందిలో విష్ణుచిత్తుడు ప్రథములు (పెరియాళ్వారు). ప్రణవ రూపానికి, ప్రణయ రూపానికి పసిడి సేతువుగా నిలిచిన తిరుప్పావై రూపకర్త్రి ఆండాళ్‌ ఆళ్వారులలో ఏకైక మహిళ. విశిష్టాద్వైత ప్రవక్త భగవద్రామానుజాచార్యులు ప్రతి విష్ణ్వాలయంలో గోదాదేవి సన్నిధిని ఏర్పరచి ఆమెకు, ఆమె పాశురాలకు ప్రత్యేక స్థానం కల్పించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ ధను ర్మాసంలో తిరుప్పావైనే సుప్రభాతంగా వినిపిస్తారు.

మధురభక్తికి ప్రతీక అయిన శ్రీగోదాదేవిని లక్ష్మీదేవి అంశంగా భావించిన పదకవితా పితామహుడు అన్నమాచార్య ‘చూడరమ్మ సతులాల సోబాన ఁబాడరమ్మ/కూడున్నది పతి ఁజూడికుడుత నాచారి’ అని కీర్తించారు.

‘గోదాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి కనుక ఆమెకు సింగారాలు కొరతా? మన్మథుని తల్లి కనుక చక్కదనాలు కొదవా? చంద్రుని తోబుట్టువు కనుక సొంపైన కళలకు కొదవ? పాల సముద్రపు తనయ కనుక గంభీరాలకు తక్కువా? లోకమాత కనుక దయకు తక్కువా? పద్మనివాసిని కనుక చల్లదనానికి లోటా? దేవవందిత కనుక మహా మహిమలకు కరవా?అమృతానికి చుట్టమైనందున ఆనందాలకు కొదవా?’ అని ప్రశ్నించుకుని సమర్థించుకున్నారు. అన్ని ఉన్నత లక్షణాలను కలిగిన ఆమెను చేపట్టేందుకు శ్రీవేంకటేశ్వరుడే వచ్చి పరిణయ మాడాడట. అన్నమయ్య దృష్టిలో ఆయనే రంగనాథుడు. ధనుర్మాసంలో శ్రీవారి సుప్రభాతం బదులు తిరుప్పావై పఠనం ఈ కీర్తనకు నేపథ్యం కావచ్చు.

అన్ని విష్ణ్వాలయాలలో వేకువ జామున దీనిని గానం చేస్తారు. తెల్లవారుజామునే మేల్కొని, నిత్యానుష్ఠానాల ఆచరణ భారతీయ సంప్రదాయం. ధనుర్మాసంలో ఆ సయంలోనే తిరుప్పావై గానం చేయాలన్న నిబంధన వెనుక పరమార్థం అదే కావచ్చని ఆధ్యాత్మికవేత్తలు అంటారు.

నైవేద్యం విశిష్టత

ధనుర్మాస వ్రత నైవేద్యంగా పులగం, పాయసం, దధ్యోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్నితో పాటు ఆకలి పెరుగుతుంది. సాత్త్వికాహార స్వీకరణతోనే జఠరాగ్ని చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసరపప్పులో చలువు చేసే గుణం ఉన్నందున వాటిని ప్రసాదంగా వినియోగిస్తారని చెబుతారు.

భగవంతుడిని భక్తితో వశపరచుకోవచ్చని నిరూపించిన తపస్విని ఆండాళ్‌, ‌తిరుప్పావై పారాయణం/ గానం / శ్రవణం వల్ల దీర్ఘాయువు, ఆరోగ్యం, సకల ఐశ్వర్యాలు, ముక్తి సిద్ధిస్తాయని ఆఖరి పాశురంలో పేర్కొన్న అంశాలు సకల జనావళికి కలగాలని కోరుకుందాం.

‘స్వోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధుర జిష్ణవే

విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళమ్‌’

‌వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE