– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

ఓ ‌ప్రవాస భారతీయుడు బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి అయ్యారని మన దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు. ఆయనే రుషి సూనక్‌. ‌భారతదేశాన్ని రెండువందల ఏళ్లు పాలించిన బ్రిటన్‌ను ఇప్పుడు ఒక భారతీయుడు పాలిస్తాడని వీరంతా భావిస్తున్నారు. కానీ ఏ అంశంలో అయినా బీజేపీనీ, మెజారిటీ హిందువులనూ ఇరుకున పెట్టే ప్రయత్నం ఇక్కడ అడ్డూ అదుపూ లేకుండా జరుగుతోంది. కొన్ని వర్గాలు రుషి ఎంపికను తమ రాజకీయ అవసరాలకి ఉపయోగించుకుందామని చూసి, బొక్క బోర్లా పడ్డాయి. వారి బాధంతా ఒకనాడు ప్రపంచాన్ని ఏలిన దేశంలో ఒక హిందువు అత్యున్నత స్థానానికి చేరడమే. ఎప్పటి మాదిరిగానే అర్థం లేని ప్రశ్నలు, చవకబారు రాజకీయ వ్యూహాలు ఈ ధోరణిలో స్పష్టంగా కనిపించాయి. రుషి బ్రిన్‌ ‌ప్రధాని అయిన వెంటనే ఇక్కడి మేధావులు, ముస్లిం పార్టీల నాయకులు, కాంగ్రెస్‌ ‌తదితర సంస్థలు ఎలాంటి వ్యాఖ్యలు చేశాయి? భారత్‌లో మైనారిటీలు ప్రధాని పదవి వరకు రాగలరా? నేను జీవించి ఉండగా, లేకపోతే కన్నుమూసిన తరువాత అయినా హిజాబ్‌ ‌ధరించిన మహిళ భారతదేశ ప్రధాని అవుతారు అంటూ మరొకరి ప్రకటన. మైనారిటీలను అణచివేస్తారు కాబట్టే ఆ పదవి రాదు. ఇలా వ్యాఖ్యానాలు చేస్తూ అక్కసు బయటపెట్టుకుంటున్నారు. ఇలాంటి ప్రకటనలు, వీటికి మీడియా ప్రాధాన్యం ఇవ్వడం వంటి పరిస్థితుల్లో రుషి బ్రిటన్‌ ‌ప్రధాని ఎలా కాగలిగారు? తన పూర్వికుల జన్మభూమి భారత్‌కు ఎంతమేర ఉపయోగపడగలరనే ఆరోగ్యకరమైన చర్చ పక్కదోవ పడుతోంది.


యునైటెడ్‌ ‌కింగ్‌డమ్‌కు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలతో ఏదోరకమైన సంబంధం ఉంటుంది. ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా అన్ని ఖండాల్లో ఏదో ఒక దేశాన్ని తన ఏలుబడిలో ఉంచుకున్న బ్రిటన్‌ ‌నిత్యం వార్తల్లో ఉంటుంది. ఇలాంటి దేశానికి రుషి ప్రధానమంత్రి కావడం మనందరికీ ఆనందం కలిగించడం సహజం. ఒకప్పుడు భారతదేశాన్ని బానిసదేశంగా చూసిన, పాలించిన దేశాన్ని ప్రవాస భారతీయుడు పాలించడం మనకు సంతోషాన్ని కలిగించకుండా ఎలా ఉంటుంది? పైగా ఆయన తాజాగా తాను హిందూ ప్రధానిగా గర్విస్తున్నాని కూడా ఒక ప్రకటన చేశారు. అంతేకాదు అధికారికంగా క్రైస్తవ దేశానికి, ఒక క్రైస్తవేతరుడు, అందునా ఒక హిందువు ప్రధాన మంత్రి కావడం ఈ ఆనందాన్ని మరింత పెంచింది. హిందువులకు అత్యంత పవిత్రమైన దీపావళిని, హిందూమత మూలాలను మరవకుండా, నిత్య జీవితంలో ఆచరణాత్మకంగా పాటిస్తున్న వ్యక్తి రుషి. బ్రిటన్‌ ‌పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు భగవద్గీతపై ప్రమాణం చేశారు. తరచూ కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లడం, గోపూజ చేయడం కూడా కనిపిస్తాయి. వివాహమై 13 ఏళ్లయినా రుషి భార్య అక్షతామూర్తి తన భారత పౌరసత్వాన్ని కొనసాగిస్తు న్నారు. బ్రిటిష్‌ ‌పాలన నుండి స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో విన్న ఈ వార్త గర్వకారణమని ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

‘తన.. మన’ విషయం సహా, భారతీయుడు ఏ రంగంలో విజయాలు సాధించి ప్రపంచ ఖ్యాతి పొందినా, వారి వ్యక్తిగత జీవితాలపై చర్చ జరగడం సహజం. ఎవరి మనస్తత్వం వారిది అని ఇలాంటి వారిని పెద్దగా పట్టించుకోం. కానీ ఇదే సమయంలో భారతీయులు సాధించిన విజయాలను చూసి ఓర్వలేని వర్గాలూ ఉంటాయి. వీరు మన శత్రుదేశాల వారైతే వాళ్లంతేనని వదిలేయొచ్చు. కానీ మన దేశంలో, మన మధ్యే ఉంటూ మెజారిటీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కుళ్లు వ్యాఖ్యానాలు చేసేవారిని తేలికగా వదిలేయలేం. ‘దాల్‌ ‌మే కుచ్‌ ‌కాలా హై’ అని అర్థమైతే వారి మీద దృష్టి పెట్టక తప్పదు. బ్రిటన్‌ను చూసి భారత్‌ ‌నేర్చుకోవాలని సుద్దులు చెబుతున్న మేధావులూ ఉన్నారు. వారి వ్యాఖ్యల్లోని డొల్లతనాన్ని విశ్లేషించి చూద్దాం.

రుషికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినంద నలు తెలిపారు. మన శత్రుదేశమైన పాకిస్తాన్‌కు ఇమ్రాన్‌, ‌షహబాజ్‌లకు కూడా ప్రధానులు అయిన సందర్భంలో అభినందనలు తెలిపారు. ఇవన్నీ ప్రోటోకాల్‌ ‌ప్రకారం జరిగే మర్యాదల్లోకి వస్తాయి. బ్రిటన్‌ ‌ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం, దీపావళి శుభాకాంక్షలు కలిపి తెలిపిన మోదీ, రుషిని యూకే, భారతీయుల జీవన వారధిగా అభివర్ణించారు. చారిత్రాత్మక బంధాన్ని ఆధునిక భాగస్వామ్యంగా మారుద్దామని, ప్రపంచ సమస్యలపై కలిసి పని చేద్దాం, రోడ్‌ ‌మ్యాప్‌-2030‌ను అమలు చేద్దాం అంటూ మోదీ పంపిన సందేశం రాజనీతిజ్ఞతకు, మన దౌత్య విధానానికి అద్దం పడుతోంది.ఇద్దరు ప్రధానులు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇండోనేషియాలో జరగనున్న జి20 సదస్సులో వ్యక్తిగతంగా కలుసుకోనున్నట్టు తెలిపారు. ఈ సందేశం ఎంతో హుందాగా, ప్రోటోకాల్‌ ‌ప్రకారం ఉంది. కానీ మన రాజకీయ నాయకులు ఇదే అంశం మీద ఎంత అనుచితంగా స్పందించారో గమనించండి.

ఎంఐఎం నాయకుడు, హైదరాబాద్‌ ఎం‌పీ అసదుద్దీన్‌ ఓవైసీ, ‘‘ప్రజాస్వామ్యబద్ధంగా ఆ దేశంలో ప్రధానిని మార్చేశారు. అది వాళ్ల నిర్ణయం. కానీ… హిజాబ్‌ ‌ధరించడంపై మన దగ్గర నిషేధం అమలవు తోంది. నేనొకటే చెబుతున్నాను. నేను బతికున్నప్పుడో లేదంటే నా తరవాతైనా సరే హిజాబ్‌ ‌ధరించిన మహిళ దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటు న్నాను’’ అన్నారు. అసలు హిజాబ్‌కు, ప్రధాని పదవికి సంబంధం ఏమిటి? ఇస్లామిక్‌ ‌దేశాల్లోనే, ముఖ్యంగా ఇరాన్‌లో హిజాబ్‌ ‌మీద వ్యతిరేకత రావడం, రెండు నెలలుగా ఆందోళనలు కొనసాగడం చూస్తున్నాం. సౌదీ అరేబియా సహా అనేక దేశాల్లో గతంలో కన్నా కాస్త ఉదారంగా వ్యవహరిస్తున్నారు. కానీ మన భారతీయ ముస్లిం నాయకులు మాత్రం ఛాందస వాదాన్ని రెచ్చగొడుతున్నారు. కర్ణాటకలో అర్థం లేని హిజాబ్‌ ఆం‌దోళనలు, సుప్రీం కోర్టు స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి వారి మనస్తత్వం మారలేదు. పాపం, ఒవైసీ ఈ వ్యాఖ్య చేసిన ఒక పక్షానికే కేరళలోను హిజాబ్‌ ‌దగ్ధకాండ మొదలైంది.

ప్రతీది రాజకీయం చేయడమంటే ఇదే. భారతదేశంలో ముగ్గురు ముస్లింలు అత్యున్నత రాష్ట్రపతి పీఠంపై కూర్చున్నారు. ఇది ఓవైసీకి తెలుసు. ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావించరు. ‘‘అసదుద్దీన్‌ ఒవైసీకి ఒకవేళ అభివృద్ధిపై అంత నిబద్ధత ఉండి ఉంటే…హైదరాబాద్‌లోని పాతబస్తీ వరకూ మెట్రో రైల్‌ ‌మార్గం కొనసాగింపును ఎందుకు అడ్డుకున్నారు? ఇరాన్‌ ‌లాంటి దేశాల్లో హిజాబ్‌పై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే…వాటిపై మాత్రం ఒవైసీ మాట్లాడరు..?’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌ ‌విమర్శించారు. మొదట ఎంఐఎంకు ఒక మహిళను అధ్యక్షురాలిని చేసిన తరువాత ఒవైసీ మాట్లాడితే మంచిదన్న అభిప్రాయం వెల్లువెత్తింది. అందుకే భారత్‌ ‌ప్రజాస్వామ్య దేశమని, ఆ విధానానికి కట్టుబడి ఉన్న వాళ్లెవరైనా ఉన్నత స్థానానికి చేరుకుంటారని బీజేపీ నేత స్పష్టం చేశారు. ‘‘ఎస్టీ వర్గానికి చెందిన మహిళ భారత రాష్ట్రపతి అవుతారని ఎవరైనా ఊహించారా’’ అని ప్రశ్నించారు.

‘రుషి బ్రిటన్‌కు తొలి భారతీయ సంతతి ప్రధాని కావడం గర్వకారణం. యూకే ఒక మైనారిటీ జాతీయుడిని ప్రధానమంత్రిగా అంగీకరించినప్పటికీ, మేము ఇప్పటికీ ఎన్‌ఆర్‌సీ, సీఏఏలాంటి విభజన, వివక్షతతో కూడిన చట్టాల సంకెళ్లలో ఉన్నామని గుర్తుంచుకోవడం మాకు బాగా ఉపయోగపడు తుంది..’ అంటూ జమ్మూ కశ్మీర్‌ ‌మాజీ ముఖ్యమంత్రి పీపుల్స్ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ట్వీట్‌ ‌ద్వారా స్పందించారు. ఇదే అవకాశంగా మెహబూబా అక్కసు బయట పెట్టుకుంది. ఆమెకు మైనారిటీలపై అంత ప్రేమ ఉంటే, తాము ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జమ్మూ కశ్మీర్‌ ‌రాష్ట్రంలో మైనారిటీలుగా ఉన్న హిందువులు కశ్మీరీ పండితుల హక్కులను ఎందుకు కాపాడలేదు? భారత దేశంలో హిందూ మెజారిటీ రాష్ట్రాలకు మైనారిటీలు ముఖ్యమంత్రిగా పని చేసిన సందర్భాలున్నాయి. కానీ జమ్మూ కశ్మీర్‌లో ఇప్పటి వరకూ ఒక హిందువు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయాడు?

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ‌ప్రసాద్‌, ‘‌యూకే ప్రధాన మంత్రిగా రుషి ఎన్నికైన తర్వాత భారతదేశంలోని మైనారిటీల హక్కులపై వ్యాఖ్యానిస్తూ మహబూబా ముఫ్తీ చేసిన ట్వీట్‌ ‌చూశాను. మెహబూబా ముఫ్తీ జీ! మీరు జమ్మూ కశ్మీర్‌లో మైనారిటీని ముఖ్య మంత్రిగా అంగీకరిస్తారా? దయచేసి నిజాయితీగా ప్రత్యుత్తరం ఇవ్వండి’ అని ట్విట్టర్‌ ‌ద్వారా ఆయన నిలదీశారు. మెహబూబా ముఫ్తీకి ప్రతి విషయాన్ని విమర్శించే అలవాటు ఉందని బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్‌ ‌ఠాకూర్‌ అన్నారు. ‘భారతీయులకు బ్రిటన్‌కు ప్రధానమంత్రి అయ్యే సామర్థ్యం ఉంది, బ్రిటిష్‌వారు భారతదేశాన్ని శతాబ్దాల పాటు పాలించారు. ఇప్పుడు భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశ ప్రధాని అయ్యారు’ అని ఠాకూర్‌ ‌వ్యాఖ్యానించారు.

ఈ పరిణామం మీద కాంగ్రెస్‌ ‌నాయకులు చేసిన ప్రకటనలు మరింత విచిత్రంగా ఉన్నాయి. ఇటాలియన్‌ ‌మూలాలు ఉన్న సోనియా గాంధీ భారత ప్రధాని కాలేకపోయారనే బాధ వారి స్పందనల్లో అంతర్లీనంగా ఉంది. బ్రిటన్‌, అమెరికాలో మన వాళ్లు అగ్రనేతలయ్యారని, కానీ భారత్‌లో మైనారిటీ వర్గాల నేతలకు అధికారం దక్కే అవకాశం ఉందా? అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు భిన్నత్వంలో ఏకత్వం విషయంలో బ్రిటన్‌ ‌నుంచి భారత్‌ ‌పాఠాలు నేర్చుకోవాల్సి రావడం బాధాకరమన్నారు జైరాం రమేశ్‌. ‘‌బ్రిటన్‌లో ఇది సాధ్యమైందంటే మనం దృష్టి సారించాల్సిన సమయం వచ్చినట్టే. అక్కడ జరిగిన ఈ మార్పునకు ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. ఓ ‘కనిపించే’ మైనార్టీకి అత్యున్నత పదవి దక్కింది. ఈ విజయాన్ని మనమంతా ఆస్వాదిస్తే సరిపోదు. భారత్‌లోనూ ఇది సాధ్యమవుతుందా అని కచ్చితంగా ప్రశ్నించాలి’ అని అన్నారు ఆ పార్టీ సీనియర్‌ ‌నేత శశిథరూర్‌. ‘‌కనిపించే మైనారిటీ’ అంటే ఏమిటని బీజేపీ ప్రశ్నించింది. సిక్కులను ‘కనిపించే మైనారిటీ’గా పరిగణించవచ్చా లేదా అంటూ మన్మోహన్‌ ‌సింగ్‌ను ఉదహరించారు. ఇటాలియన్‌ ‌మూలాలున్న రోమన్‌ ‌క్యాథలిక్‌ ‌సోనియా గాంధీ మన దేశంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. పార్లమెంటుకు వరుసగా ఎన్నికవుతున్నారు. ‘81% హిందువులు ఉన్న దేశంలో ముస్లిం ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ ‌కలాం సిక్కు మన్మోహన్‌ ‌సింగ్‌ ‌చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎస్టీ (శశి థరూర్‌) ‌రాజకీయాలు అతని గ్లిబ్‌ ‌టాక్‌తో తరచుగా విభిన్నంగా ఉంటాయి’’ అని బీజేపీ ఐటీ సెల్‌ ‌చీఫ్‌ అమిత్‌ ‌మాలవీయ ట్వీట్‌ ‌చేశారు.

రుషిని అడ్డం పెట్టుకుని తమను లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్‌ ‌వ్యాఖ్యలకు బీజేపీ గట్టి సమాధానమే ఇచ్చింది. ‘రుషి ఎన్నికైన తర్వాత మన దేశ నాయకులు మెజారిటీవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏపీజే అబ్దుల్‌కలాం రాష్ట్రపతి పదవిని అలంకరించారని, మన్మోహన్‌ ‌సింగ్‌ 10 ‌సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారని వారికి సున్నితంగా గుర్తు చేస్తున్నాను. గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము ఇప్పుడు రాష్ట్రపతి. భారత సంతతికి చెందిన సమర్థ నాయకుడు రుషి బ్రిటన్‌ ‌ప్రధాన మంత్రి కాబోతున్నారు. ఈ అసాధారణ విజయంపై మనమందరం ఆయనను అభినందించాలి. కొంత మంది భారతీయ రాజకీయ నాయకులు దురదృష్టవ శాత్తు ఈ సందర్భంగా రాజకీయ సంబరం చేయడానికి ప్రయత్నించడం విషాదకరం’ అని రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌వ్యాఖ్యానించారు.ఈ విషయంలో మన కొందరు నాయకులు చేస్తున్న విమర్శలను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేత ఇంద్రేష్‌కుమార్‌ ‌కూడా తప్పుపట్టారు. భారత రాజకీయాల్లో పట్టుకోల్పోయిన పార్టీలు ఇలా మాట్లాడుతున్నాయని విమర్శించారు. మైనారిటీలకు ఎన్నో ఉన్నత పదవులు లభించాయని గుర్తు చేశారు.

ఇంతకీ కన్జర్వేటివ్స్ ‌రుషిని ఎన్నుకున్నది ఆయన మైనారిటీ అయినందువల్ల కాదు. ఆ కోటా కింద కాదు. పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్న టోరీ ఎంపీల మద్దతు ఆయనకు ఉంది. ఎందుకంటే వారి ప్రజాస్వామ్య సంప్రదాయం అలా పనిచేస్తుంది. రుషి తన పార్టీ ఎంపీల మద్దతు పొందినట్లే, భారతదేశం లోని మైనారిటీ నాయకులు కూడా తమ పార్టీల మద్దతు కూడగట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే స్వేచ్ఛ ఉంది. వారికి మద్దతుగా ఇక్కడి పార్టీలు అండగా నిలిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. సోనియా గాంధీ అయినా, రాహుల్‌ అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. అది జన్మతః భారతీయులు అయి ఉంటేనే అని ఇక్కడ గుర్తుంచుకోవాలి.

మన దేశంలో కేవలం 1.72% వాటా కలిగిన సిక్కు మైనారిటీ వర్గానికి చెందిన డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రధానమంత్రి అయ్యారు. మన్మోహన్‌కు కాంగ్రెస్‌ ‌పార్టీ అవకాశం ఇవ్వడం వల్లే ఆయన వరుసగా 2 సార్లు ప్రధాని అయ్యారు. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి దేశ ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఆ వాదనలన్నీ బూటకమైనవి, అర్థరహితమైనవి. బ్రిటన్‌ ఎన్నికల పరంగా ప్రజాస్వామ్య దేశం అయినా, రాచరికం కూడా ఉంది. వంశ పారపర్యంగా రాజు లేదా రాణి పాలిస్తారు. చక్రవర్తి చర్చ్ ఆఫ్‌ ఇం‌గ్లాండ్‌కు అధిపతి. ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ నాయకుడిని పార్లమెంట్‌ ‌ప్రధానిగా ఎన్నకుంటుంది. వారు రాజుకు వంగి అభివాదం చేసి బాధ్యతలు తీసుకోవడం ఆనవాయితీ. కుటుంబ పార్టీ కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యాన్ని గమనించండి. ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్‌ ‌సింగ్‌ను బహిరంగంగా గౌరవించడం చూశామా? తాజా ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే సోనియా, రాహుల్‌ ‌మద్దుతుతోనే ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. ఆ కుటుంబం ఆమోదం లేకుండా పోటీ చేసిన శశి థరూర్‌ ఎలా భంగపడ్డారో చూశాం.

ప్రవాస భారతీయుడు రుషి బ్రిటన్‌ ‌ప్రధాని కావడం భారతీయులందరికీ గర్వించదగ్గ విషయమే. కానీ ఆయనకు ఉన్న పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. భారతీయ, హిందూ మూలాలను ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. అంతమాత్రాన ఆయన భారత దేశానికి భారీగా ఏదో చేస్తారని కలలు కంటే అది పొరపాటే అవుతుంది. రుషి బ్రిటన్‌ ‌రాజకీయాల్లో అనూహ్యంగా పైకి వచ్చారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చి 2015 పార్లమెంట్‌ ఎన్నికల్లో రిచ్‌మాండ్‌ ‌నుండి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. పార్లమెంట్‌లో తన వాగ్ధాటితో అందరి దృష్టిలో పడ్డారు. ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్‌ ఆయనకు ఆర్థిక శాఖ మంత్రి (బ్రిటన్‌లోకార్యదర్శి అంటారు) బాధ్యతలు ఇస్తే తన సామర్ధ్యాన్ని నిరూపించు కున్నారు. కరోనా కష్టకాలంలో దెబ్బతిన్న బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థలో తిరిగి విశ్వాసాన్ని నెలకొల్పడం అందరనీ ఆకట్టుకుంది.

పార్టీగేట్‌ ‌కుంభకోణంలో ఇరుక్కున్న బోరిస్‌ ‌జాన్సన్‌ ‌ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవాలని అందరికన్నా ముందుగా గళమెత్తిన రుషి బ్రిటన్‌ ‌ప్రజలను ఆకట్టకున్నారు. అదే సమయంలో అధికార కన్జర్వేటివ్‌ ‌పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. తదుపరి ప్రధాని ఎవరు అనే చర్చ జరిగింది. ఈ సమయంలో ఆ పదవికి కూడా రుషి పోటీ పడ్డారు. మెజారిటీ ఎంపీలు ఆయనకు అండగా నిలిచారు. అయితే ఆ సమయంలో కన్సర్వేటివ్‌ ‌పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది లిజ్‌ ‌ట్రస్‌ ‌వైపు మొగ్గుచూపారు. ఆమె ఆర్థిక విధానాలు తప్పు అని రుషి వాదించినా ఎవరూ పట్టించుకోలేదు. బ్రిటన్‌ ‌ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లిజ్‌ ‌ట్రస్‌ ‌తీసుకున్న చర్యలు బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేశాయి. అధిక పన్నులు చెల్లిస్తున్న వారికి మినహాయింపులు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. దీంతో రెండు నెలలు కూడా పని చేయకముందే లిజ్‌ ‌రాజీనామా చేయక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో కన్సర్వేటివ్‌ ‌పార్టీకి రుషి మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు.

కన్జర్వేటివ్‌ ‌పార్టీ నాయకత్వం అంతర్లీనంగా జాతి వివక్ష వైపు మొగ్గు చూపుతుందనే విమర్శలున్నాయి. గతంలో బ్రిటన్‌ ‌ప్రధానిగా పనిచేసిన విన్‌స్టన్‌ ‌చర్చిల్‌ ఈ ‌పార్టీ నాయకుడు.ఆయన భారతీయులకు స్వాతంత్య్రం ఇవ్వడానికి ఇష్టపడలేదు. అదే సమయంలో ప్రతిపక్ష లేబర్‌ ‌పార్టీ కాస్త ఉదారంగా ఆసియన్‌, ఆ‌ఫ్రికన్‌ ‌జాతీయులకు అవకాశాలు ఇస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో తమ విధానాలు మార్చుకునేందుకు కన్సర్వేటివ్స్‌కు రుషి రూపంలో మంచి అవకాశం వచ్చింది.

ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, రుషి బ్రిటన్‌లో పేరు ప్రఖ్యాతులు కలిగిన నేత కాదు. బ్రిటిష్‌ ‌వారు ఆయనను చూసి ఓటు వేసి కన్జర్వేటివ్‌ ‌పార్టీకి అధికారం కట్టబెట్టలేదు. ప్రస్తుతం నాయకత్వ సంక్షోభలో ఉన్న కన్జర్వేటివ్‌ ‌పార్టీ తమ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే సామర్థ్యం రుషిలో చూశారు. అదే ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఇచ్చింది. భారతీయ సంతతికి చెందిన రుషి బ్రిటన్‌లో జన్మించారు. ఆయనను పార్లమెంటుకు ఎన్నుకున్నది బ్రిటన్‌ ‌ప్రజలు. కాబట్టి వారి ఆకాంక్షలకు లోబడే రుషి పని చేయాలి. అయితే ఒక దేశాధినేత హోదాలో ఆయన పరోక్షంగా భారతీయులకు మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు బ్రిటన్‌కు వృత్తి నిపుణుల అవసరం ఉంది. అక్కడి యూనివర్సిటీల్లో అత్యున్నత ప్రమాణాలున్న కోర్సులు ఉన్నాయి. ఈ రూపంలో ఎంతో మంది భారతీయ యువతకు వీసాల రూపంలో అవకాశాలు లభిస్తాయి. అదే విధంగా ఇరు దేశాలకు అనుకూలమైన వాణిజ్య ఒప్పందాలకు ఇదే చక్కని అవకాశం.

ఈ వారంలో ఇండోనేషియాలో జరగనున్న జీ-20 సమావేశాల్లో తొలిసారిగా మోదీ, రుషి భేటీ కాబోతున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ, శాస్త్ర సాంకేతిక సంబంధాల్లో ఈ సమావేశం మరో మైలురాయిగా మారగలదని ఆశిద్దాం. కొద్ది రోజుల క్రితం భారత్‌ ‌ప్రపంచంలో ఐదో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్‌ ‌స్థానాన్ని అక్రమించింది. ఇలాంటి తరుణంలో భారత్‌కు బ్రిటన్‌ ‌కన్నా, బ్రిటన్‌కే భారత్‌ అవసరం ఎక్కువ. ఈ తరుణంలో ప్రవాస భారతీయుడు రుషి ఆ దేశ ప్రధానిగా ఉండటం మనకు కలసి రాగలదు.

About Author

By editor

Twitter
Instagram