జాతీయ రాజకీయాలంటూ తనదైన పల్లవి అందుకున్న కేసీఆర్‌.. ‌భారత ప్రధాని నరేంద్ర మోదీని ముఖాముఖిగా కలిసే సందర్భం ఎప్పుడొచ్చినా తప్పించుకుంటున్నారు. ఒక ప్రభుత్వాధినేతగా దేశ, రాష్ట్ర సంబంధాలకు వారధిగా ఉండాల్సిన కేసీఆర్‌.. ‌ప్రధాని నరేంద్రమోదీకి ముఖం చాటేస్తున్నారు. కనీసం ప్రొటోకాల్‌నూ అనుసరించడం లేదు.

గతంలోనే ఓసారి హైదరాబాద్‌కు మోదీ వచ్చిన సమయంలో అనారోగ్యం కారణం చూపించగా.. మొన్నటికి మొన్న మరోసారి ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమం కోసం హైదరాబాద్‌ ‌వచ్చిన సమయం లోనూ కేసీఆర్‌ ‌ప్రొటోకాల్‌ ‌పాటించాల్సి వస్తుందని తనదైన షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు. ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలకాల్సి వస్తుందని, ఆయన ఉన్నంతసేపు వెంట ఉండాల్సి వస్తుందన్న కారణంతో బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఆయన వైఖరి రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసింది.

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ ‌పర్యటన ఖరారైన తర్వాత కేసీఆర్‌ ‌ముందుగా రూపొందించు కున్న షెడ్యూల్‌ ‌ప్రకారం వారం రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఉండాలి. ఆ మేరకు మే 20వ తేదీన కేసీఆర్‌ ‌ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు మరికొందరితో భేటీ అయ్యారు. మరుసటిరోజు పంజాబ్‌ ‌వెళ్లి.. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత అనూహ్యంగా షెడ్యూల్‌ను పక్కనబెట్టి 22 సాయంత్రమే హైదరాబాద్‌ ‌చేరుకున్నారు.

ఇక, పీఎంఓ షెడ్యూల్‌ ‌ప్రకారం మే 26వ తేదీన నరేంద్రమోదీ హైదరాబాద్‌ ‌వచ్చారు. ముందుగా రూపొందించుకున్న షెడ్యూల్‌ ‌ప్రకారం అదేరోజు కేసీఆర్‌ ‌కూడా బెంగళూరు పర్యటన షెడ్యూల్‌లో చేర్చుకున్నారు. న్యూఢిల్లీ నుంచి నేరుగా బెంగళూరు వెళ్లాల్సిన కేసీఆర్‌ ‌మధ్యలోనే హైదరాబాద్‌ ‌రావడంతో బెంగళూరు పర్యటన రద్దు చేసుకున్నట్టే అని కొందరు భావించారు. మరికొందరేమో హైదరాబాద్‌ ‌నుంచే నేరుగా బెంగళూరు వెళ్తారని భావించారు. దీంతో, 26వ తేదీన కేసీఆర్‌ ఏం ‌చేస్తారన్న దానిపై చివరి దాకా ఉత్కంఠ కొనసాగింది. కానీ, మోదీ తెలం గాణకు వచ్చిన రోజు కేసీఆర్‌ ‌హైదరాబాద్‌లో ఉండ కుండా కర్ణాటక బయలుదేరి వెళ్లిపోయారు. ఇక, ఆయన ముందు రూపొందించుకున్న షెడ్యూల్‌ ‌ప్రకారం బెంగళూరు నుంచి నేరుగా మహారాష్ట్రలోని రాలెగావ్‌ ‌సిద్ధి, షిరిడీ వెళ్లాల్సి ఉంది. కానీ, అదేరోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ ‌వచ్చారు. మహా రాష్ట్రకు వెళ్లాల్సిన కేసీఆర్‌.. ఆ ‌పర్యటనను ఆకస్మి కంగా రద్దు చేసుకున్నారు. అంటే, కేవలం ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం, వీడ్కోలు పలకొద్దని, ఆయన పాల్గొన్న సభలో తాను పాల్గొనవద్దన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ ‌తన షెడ్యూల్‌లో మార్పులు చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు తనకు స్వాగతం పలికిన పార్టీ నేతలు, కేడర్‌ను ఉద్దేశించి బేగంపేట ఎయిర్‌పోర్టు దగ్గర బహిరంగసభలో ప్రసంగించారు. అదేరోజు చెన్నై వెళ్లిన ప్రధాని.. 30 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రధాని హైదరా బాద్‌, ‌చెన్నై పర్యటనలు అధికారికంగా జరిగినవి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు అధికా రంలో ఉన్నాయి. అంతేకాదు బీజేపీని ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. అయితే, ప్రధాని మోదీ పర్యటనలో తెలం గాణ సీఎం ఒకలా.. తమిళనాడు ముఖ్యమంత్రి మరోలా వ్యవహరించారు. మోదీ కార్యక్రమానికి డుమ్మా కొట్టి బెంగళూరు వెళ్లారు కేసీఆర్‌. ‌తమిళ నాడు సీఎం స్టాలిన్‌ ‌మాత్రం ప్రధాని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల తీరుపై జోరుగా చర్చ సాగుతోంది. మోదీకి ముఖం చూపించ లేకే కేసీఆర్‌ ‌బెంగళూరు పారిపోయారని రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడ్డారు. నిజానికి బీజేపీని టీఆర్‌ఎస్‌ ‌కంటే డీఎంకే పార్టీనే ఎక్కువ వ్యతిరేకిస్తుంది. అయినా డీఎంకే చీఫ్‌, ‌తమిళనాడు సీఎం స్టాలిన్‌ ‌మాత్రం చెన్నై వచ్చిన ప్రధాని మోదీకి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ప్రధాని కార్యక్రమంలో పాల్గొ న్నారు. అంతేకాదు రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్ల చిట్టాను, విజ్ఞప్తుల జాబితాను సభా వేదికపైనుంచే ప్రధానికి వినిపించారు.

మరోవైపు సోషల్‌ ‌మీడియాలోనూ కేసీఆర్‌ ‌తీరుపై నెటిజన్లు ఫైరవుతున్నారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి హాజరై రాష్ట్రానికి మరిన్ని నిధులు  కొత్త ప్రాజెక్టులు వచ్చేలా ప్రయత్నిం చాల్సింది పోయి, డుమ్మా కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవించాల్సిన అవసరం, బాధ్యత ఉంటాయని గుర్తు చేస్తున్నారు. ఆరోజు ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బ్యానర్లు వెలిశాయి. వాటిలో తెలంగాణకు సంబంధించిన 17 సమస్యలను ప్రస్తావిస్తూ మోదీని నిలదీశారు. వీటిని టీఆర్‌ఎస్‌ ‌పార్టీయే ఏర్పాటు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబం ధించిన సమస్యలను ఇలా బ్యానర్లలో పెట్టి ప్రచారం చేసుకోవడం కంటే.. నేరుగా ప్రధానిని కలిసి నిలదీస్తే సరిపోయేది కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తంగా ప్రధాని మోదీ పర్యటనలో కేసీఆర్‌ ‌తీరుపై సొంత పార్టీలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలుస్తోంది.

సాధారణంగా పార్టీలు సిద్ధాంతాలు వేరైనప్పుడు కేంద్రంతో కొన్ని రాష్ట్రాలు దూరంగా ఉంటాయి. కానీ గిట్టకపోయినా, నచ్చకపోయినా దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారంటే ప్రొటోకాల్‌ ‌ప్రకారం కొన్ని కార్యక్రమాలకు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌మాత్రం బీజేపీతో కొన్నాళ్లుగా నెలకొన్న విభేదాల కారణంగా ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమాలకు వరుసగా డుమ్మా కొడుతున్నారు. అయితే, రాష్ట్రంలో బీజేపీ సంచలన విజయాలు సాధించడం, క్రమంగా అధికార పార్టీకి దీటుగా ఎదుగుతుండటమే కేసీఆర్‌కు గిట్టడం లేదని, అందుకే ప్రధాని ఎన్నిసార్లు వచ్చినా దూరంగా ఉంటున్నారని అంటున్నారు.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram